Cyclone: ఈ సంవత్సరం చలికాలం వచ్చిన వర్షాలు మాత్రం ఆగడం లేదు.. తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఇప్పుడు మరో తుఫాను కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు ఇంకో తుఫాను రాబోతుంది.
దిత్వా తుఫాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇండిగో, ఎయిరిండియా సంస్థలు ఇప్పటికే ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల వల్ల వివిధ జిల్లాలకు వెళ్లే 54 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.
దిత్వా తుపాను బీభత్సంతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదలు 123 మందిని బలిగొంది. దాదాపు 130 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీలంక అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
వరదలు సృష్టించిన విధ్వంసానికి శ్రీలంకలో మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ధాటికి 600కు పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాలు జల దిగ్బంధమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. దాదాపు 43వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రక్షణ బృందాలు. ఈ కష్ట సమయంలో శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ చేయూతనందించింది. ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా నిత్యావసర వస్తువులను శ్రీలంకకు పంపించింది. ఈ క్లిష్ట సమయంలో ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మోడీ ప్రకటించారు.
Also Read: ఢిల్లీలో ఘోరం నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, ఇంకా
దిత్వా తుపాను ప్రభావం ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా దేశాలపైనా ఉంది. లక్షలాది మంది తుపాను బారినపడ్డారు. ఇండోనేషియాలోని సుమత్రాలో తుపాను కారణంగా 90 మందికి పైగా చనిపోయారు. 10 మందికి పైగా గల్లంతయ్యారు. దక్షిణ థాయిలాండ్పైనా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. వరదల వల్ల 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వియత్నాంలో వరదలకు 98 మందికి పైగా మరణించారు. మలేషియాలో 19 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. డిసెంబర్లో జరగనున్న ఆగ్నేయాసియా క్రీడలకు థాయిలాండ్ సిద్ధమవుతోంది. ఈ వరదల కారణంగా 11 క్రీడా కార్యక్రమాలను బ్యాంకాక్కు మార్చారు.