Oli Arrested: నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని, CPN-UML అధినేత కేపీ శర్మ ఓలిని శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త ప్రధానిగా బాలేంద్ర షా (బాలెన్) ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ పరిణామం జరగడం గమనార్హం. భక్తపూర్లోని సూర్యవినాయక్ మున్సిపాలిటీలో ఉన్న తన నివాసం నుంచి ఓలిని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బృందం అదుపులోకి తీసుకుంది. ఓలితో పాటు అప్పటి హోం మంత్రి రమేష్ లేఖక్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
గతేడాది సెప్టెంబరులో (2025) నేపాల్ను కుదిపేసిన ‘జెన్-జీ’ (Gen-Z) నిరసనల అణచివేతలో ఓలి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ యువజన ఉద్యమం హింసాత్మకంగా మారగా, దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై విచారణ జరిపిన గౌరీబహదూర్ కార్కీ నేతృత్వంలోని కమిషన్, అప్పటి ప్రధాని ఓలిపై తీవ్ర ఆరోపణలు చేసింది. భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నా, కార్యనిర్వాహక అధిపతిగా ఆయన పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమయ్యారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది.
ఇటీవల మార్చి 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) ఘనవిజయం సాధించింది. శుక్రవారం ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో, కార్కీ కమిషన్ నివేదికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నివేదికలో మాజీ ప్రధాని ఓలి, రమేష్ లేఖక్లపై క్రిమినల్ నిర్లక్ష్యం కింద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో, శనివారం తెల్లవారుజామునే అరెస్ట్ వారెంట్లు జారీ చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read: ఇరాన్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్టులు గురించి చెప్పేసిన ట్రంప్.. ఏంటి మామ.. ఇది మరీ ఓవర్
ఈ అరెస్టులు నేపాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న యువతపై జరిగిన హింసకు బాధ్యత వహించాల్సిందేనని కొత్త ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరోవైపు, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని ఓలి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా, ఒక యువ నేత (బాలెన్ షా) ప్రధాని కాగానే దేశంలోని అత్యంత శక్తివంతమైన పాత రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయించడం ఆసియా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
నేపాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం
మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
సెప్టెంబర్ 2025లో జరిగిన జెన్జీ నిరసనల అణచివేతలో హింసాత్మకంగా వ్యవహరించారని ఓలీపై ఆరోపణలు
జస్టిస్ గౌరీ బహదూర్ కార్కీ నేతృత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు
నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణం… pic.twitter.com/BAlNTMDgG0
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2026