Pakistan Crisis: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దాయాది దేశం పాకిస్తాన్పై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అధిక ఇంధన ధరలు, పెరుగుతున్న విద్యుత్ వినియోగం, విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి నేపథ్యంలో ఇంధనం ఆదా చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆ దేశం. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇస్లామాబాద్లోని మార్కెట్లు, మాల్స్, వివాహ మందిరాలను ముందుగా మూసివేయడంతోపాటు, పెళ్లి వేడుకలకు ఒకే వంటకం నిబంధనను విధించింది ప్రభుత్వం. దీంతో పాకిస్తాన్లో లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి నేపథ్యంలో ఇంధనం ఆదా చేయడం, అనవసర ఖర్చులను నియంత్రించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త పొదుపు ప్యాకేజీని ప్రకటించింది. ఈ చర్యలలో భాగంగా వాహనాల కొనుగోలుపై పూర్తి నిషేధం విధించింది. అధికారిక వాహనాలకు ఇంధన కేటాయింపులలో 50 శాతం కోత విధించింది. పాకిస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ విభాగం ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. తీసుకున్న ఈ చర్యలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇంధన కోతలు, అధికారులపై విదేశీ ప్రయాణ నిషేధం, పెళ్లిళ్లలో ఒకే వంటకంతోపాటు పలు ఉన్నాయి. కొన్ని ఆంక్షలు కనీసం మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని ప్రస్తావించింది.
పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగుల విదేశీ ప్రయాణాలపై కొన్ని మినహాయింపులు ఇచ్చింది. విదేశీ ప్రయాణం తప్పనిసరి అయితే మంత్రులు, సలహాదారులు, అధికారులు ఎకానమీ క్లాస్లో ప్రయాణించాల్సి ఉంటుంది. వివాహ సంబంధిత అన్ని వేడుకలు, కార్యక్రమాల్లో ఒకే రకమైన వంటకాన్ని వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. అంతేకాదు వాణిజ్య సంస్థలు నిర్ధేశిత సమయం కంటే ముందుగా మూసివేసే సమయాలను అందులో పేర్కొన్నట్లు రాసుకొచ్చాయి. షాపులు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బజార్లు, డిపార్టుమెంట్లు, కిరాణా షాపులు వంటివి రాత్రి 9 గంటలకు మూసి వేయాల్సి ఉంటుంది.
వివాహాలకు సంబంధించి ఫంక్షన్ హాళ్లు, పందిళ్లు, పండగ కార్యక్రమాలు నిర్వహించేవారు తమ తమ వాణిజ్య వేదికలను రాత్రి 10 గంటల లోపు మూసి వేయాలి. రెస్టారెంట్లు, కేఫ్ లు, హోటళ్లు వంటివి రాత్రి 11 గంటలలోపు మూసివేయాలి. హోమ్-డెలివరీ సేవలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చింది. ఫార్మసీలు, ఆసుపత్రులు, క్లినిక్లు, వైద్య ప్రయోగశాలలు, ఆయిల్ పంపులు, సిఎన్జి స్టేషన్లు, ఎలక్ట్రిక్-వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లు, జిమ్లు, క్రీడా సౌకర్యాలు, ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లతో సహా అనేక అత్యవసర సేవలు సమయ పరిమితుల నుండి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొంది.
ALSO READ: రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?
ప్రభుత్వ అధికారిక వాహనాలకు మూడు నెలల పాటు ఇంధన కేటాయింపులను 50 శాతం తగ్గించాలని డిసైడ్ అయ్యింది. సాయుధ దళాలు, పౌర సాయుధ దళాలు, శాంతిభద్రతల సంస్థలు, అత్యవసర సేవలు, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు చెందిన వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. పాకిస్థాన్ తన ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి భారీ మొత్తంలో చమురు, గ్యాస్ను దిగుమతి చేసుకుంటుంది. పెరుగుతున్న చమురు ధరలు విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాలనే ఒత్తిడిని ప్రభుత్వంపై పెంచుతోంది. పెట్రోల్ ధర లీటరుకు రూ. 391 కాగా, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 421 ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగేతర సాధారణ వ్యయాలపై నెలవారీగా 5 శాతం తగ్గింపుకు ప్రభుత్వం ఆదేశించింది.