Boris Johnson: యహోడిన్-డోరోహస్క్ ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు వద్ద రష్యా జరిపిన డ్రోన్ దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, జర్మన్ ఛాన్సలర్ సలహాదారు గుంటర్ సాటర్, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్ట్తో పాటు పలువురు యూరోపియన్ భద్రతా నిపుణులు ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరగడం కలకలం రేపింది. ప్రమాద సమయంలో రైలు సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉండటంతో, రక్షణ సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను త్రుటిలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో దౌత్య ప్రముఖులు ప్రయాణిస్తున్న ఈ రైలును వెంటనే సరిహద్దులోని యహోడిన్ క్రాసింగ్ వద్ద నిలిపివేశారు.
దాడి కారణంగా క్రాసింగ్ సమీపంలో నిలిపి ఉంచిన పలు సరుకు రవాణా ట్రక్కులకు మంటలు అంటుకున్నాయి. ఆ రాపిడి పెరగడంతో పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ భారీగా దెబ్బతిని పేలుడు సంభవించింది. ఈ భయానక ఘటనతో సరిహద్దులో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే, అగ్నిమాపక సిబ్బంది, సరిహద్దు రక్షణ దళాలు వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. జాన్సన్ సహా యూరోపియన్ నాయకుల బృందం ఈ దాడి నుంచి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యా ఉక్రెయిన్ మౌలిక వసతులపై జరుపుతున్న దాడులకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.
Also Read: పల్నాడులో విషాదం.. బైక్ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!