Australia: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో దారుణం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని దుండగులు కట్ చేసి దొంగిలించారు. ఈ విషయాన్ని స్థానిక డిజిటల్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై భారత్ రియాక్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహం చోరీ గురైంది. ఈ ఘటన తెలియగానే భారత్ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. మహాత్మా విగ్రహాన్ని వెంటనే కనుగొనాలని డిమాండ్ చేసింది. సుమారు 420 కేజీల బరువున్న ఉంది ఈ విగ్రహం. జనవరి 12న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మెల్బోర్న్లోని రోవిల్ ప్రాంతంలో దొంగతనానికి గురైనట్టు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.
ముగ్గురు దుండగులు జాతిపిత విగ్రహాన్ని పాదాల వద్ద కట్ చేశారు. అక్కడ నుంచి కేవలం మహాత్మా విగ్రహాన్ని తీసుకుపోయారని అక్కడి మీడియా పేర్కొంది. విగ్రహానికి చెందిన కాళ్లు మిగిలి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు మెషిన్ సహాయంతో విగ్రహాన్ని పాదాల వద్ద కట్ చేసినట్టు స్థానికంగా ఉంటే సీసీటీవీలో రికార్డు అయింది.
గాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకోయిన దుండగులు
ఆ తర్వాత దుండగులు వైట్ కలర్ వ్యాన్లో విగ్రహాన్ని తరలించినట్లు గుర్తించారు ఆస్ట్రేలియా పోలీసులు. ఈ ఘటనపై ఆస్ట్రేలియన్- ఇండియన్ కమ్యూనిటీ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యుడు సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. జాతిపిత మహాత్మా విగ్రహాన్ని ఈ విధంగా ధ్వంసం చేసి ఎత్తుకెళ్లడం ఆవేదనకు గురి చేసిందన్నాడు.
దొంగిలించబడిన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్-ICCR నుండి బహుమతిగా ఇచ్చింది. మహాత్ముడి విగ్రహాన్ని 2021లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆవిష్కరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగా దాన్ని ఏర్పాటు చేశారు.
ALSO READ: గాంధీ, నెహ్రూలు మెచ్చిన రెస్టారెంట్.. రీ-డెవలప్మెంట్ పేరుతో వందేళ్ల రుచికి కష్టాలు
విక్టోరియా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాంస్య విగ్రహాన్ని విక్రయించడానికి ప్రయత్నించే ఎవరైనా అప్రమత్తంగా ఉండాలని, తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం లభిస్తే తమకు తెలపాలని స్క్రాప్ మెటల్ డీలర్లను హెచ్చరించారు.
ఈ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2021 ఏడాది నవంబర్లో విగ్రహాన్ని ప్రారంభించిన 24 గంటల్లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈసారి ఏకంగా దొంగిలించారు. ఆస్ట్రేలియాలో భారత వ్యతిరేక భావన పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధ్వంసం జరిగినట్టు అనుమానిస్తున్నారు. భారత దౌత్య కార్యాలయాలు, ప్రార్థనా స్థలాలు వంటి సమాజ స్థలాలను లక్ష్యంగా చేసుకున్న ఖలిస్తాన్ సంబంధిత మద్దతుదారులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.
Bronze Mahatma Gandhi statue stolen from Australian Indian Community Centre in Melbourne. pic.twitter.com/DiOsi8aMpb
— The Tatva (@thetatvaindia) February 3, 2026