బ్రిటన్ రాజధాని లండన్లో అత్యంత పురాతనమైన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన భారతీయ రెస్టారెంట్ ‘వీరాస్వామి’ ప్రస్తుతం అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొనే దశకు చేరింది. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్ లీజు వివాదం కారణంగా మూతపడే ప్రమాదంలో పడింది. రీజెంట్ స్ట్రీట్లోని తన ప్రస్తుత ప్రాంగణం నుండి ఖాళీ చేయాలని యజమాని క్రౌన్ ఎస్టేట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
విక్టరీ హౌస్ అనే గ్రేడ్-II హోదా కలిగిన భవనంలో ఈ రెస్టారెంట్ నడుస్తోంది. ఈ భవన యజమాని అయిన క్రౌన్ ఎస్టేట్ లీజును పొడిగించేందుకు నిరాకరించింది. భవనానికి భారీ మరమ్మతులు (Refurbishment) చేపట్టాలనిజజ ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలో రెస్టారెంట్ ఉన్న ప్రాంతాన్ని ఆఫీసు స్థలంగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల వల్ల రెస్టారెంట్ కార్యకలాపాలకు ఆస్కారం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే, దీనిపై వీరాస్వామి యజమానులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.
వచ్చే మార్చిలో వీరాస్వామి తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో మూసివేత వార్తలు రావడం పట్ల బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడాలని కోరుతూ దాదాపు 18,000 మంది సంతకాలతో కూడిన పిటిషన్ను సిద్ధం చేశారు. దీనిని స్వయంగా కింగ్ ఛార్లెస్ III కు సమర్పించేందుకు ప్రచారం నడుస్తోంది. బ్రిటన్-భారత్ సంబంధాలకు చిహ్నంగా నిలిచే ఈ సంస్థను కాపాడాలని ప్రచారకులు కోరుతున్నారు.
ప్రముఖుల అడ్డా.. ఘనమైన చరిత్ర
1926లో ప్రారంభమైన వీరాస్వామి.. బ్రిటన్లో భారతీయ రుచులను పరిచయం చేసిన తొలి సంస్థల్లో ఒకటి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో.. బ్లిట్జ్ దాడులు జరుగుతున్నప్పుడు కూడా ఇది నిర్విరామంగా పనిచేసింది. 1950వ దశకంలో బ్రిటన్కు తొలి తందూరీ ఓవెన్ ను పరిచయం చేసిన ఘనత కూడా దీనికే దక్కుతుంది. ఈ రెస్టారెంట్ కు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి భారతీయ నేతలతో పాటు విన్స్టన్ చర్చిల్, చార్లీ చాప్లిన్, మార్లోన్ బ్రాండో వంటి ప్రపంచ స్థాయి ప్రముఖులు అతిథులుగా వచ్చారు. ఆధునిక కాలంలో ప్రిన్సెస్ అన్నే, మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ వంటి వారు దీనిని సందర్శించారు. 2016లో దీనికి ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ లభించింది.
రెస్టారెంట్ సహ-యజమాని రంజిత్ మథ్రాని మాట్లాడుతూ.. ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలన్న ప్రతిపాదనను తిరస్కరించారు. ‘ఇది కేవలం ఫుడ్ గురించి కాదు, ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ప్రదేశం. దశాబ్దాల జ్ఞాపకాలు ఈ గోడల మధ్య ఉన్నాయి. వేరే చోటికి వెళ్తే ఈ చారిత్రక వైభవం రాదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే క్రౌన్ ఎస్టేట్ లాభాల కోసం సంస్కృతిని విస్మరిస్తోందని ఆయన విమర్శించారు.
వచ్చే మార్చిలో నిర్వహించబోయే శతాబ్ది వేడుకల విందును ఒక భారీ మద్దతు ప్రచారంగా మార్చాలని యజమానులు భావిస్తున్నారు. ఈ వివాదం వచ్చే వేసవిలో కోర్టు మెట్లెక్కే అవకాశం ఉంది. ఒకవేళ వీరాస్వామి మూతపడితే.. అది బ్రిటన్-భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక తీరని లోటుగా మిగిలిపోనుంది.
Also Read: Anna Lezhneva: వరంగల్ భద్రకాళి క్షేత్రంలో అన్నా లెజినోవా పూజలు.. ఎందుకంటే?