జనరేషన్ జడ్. ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. 1995 తర్వాత పుట్టిన యువతను జెన్-జెడ్ గా పేర్కొంటున్నారు. ఈ యువత ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను శాసించే దిశగా అడుగులు వేస్తోందని. ఆమధ్య నేపాల్ లో ప్రభుత్వాన్ని దించేసిన జెన్-జెడ్ ఆందోళనలు ఇప్పుడు మెక్సికోకు పాకాయి. మెక్సికోలో కూడా రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం కనపడుతోంది.
ఎందుకీ ఆందోళనలు..?
ఏ దేశంలో అయినా రాజకీయాలు అవినీతితో ముడిపడి ఉంటాయనేది వాస్తవం. ప్రజలకు, సాధారణ ఓటర్లకు ఈ విషయం తెలియనిదేం కాదు. కానీ అందరూ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఐదేళ్లు ఏం చేసుకున్నా పర్లేదు, మాకు రావాల్సిన ఉచితాలు మాకిచ్చేస్తే పర్లేదు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓటుకి నోటు పుచ్చుకుంటూ ఈ రాజకీయాలను ఒంటబట్టించుకుంటున్నారు. కానీ జెన్-జెడ్ అలా కాదు, రాజకీయాల్లో అవినీతిని వారు సహించడం లేదు. అలాగని కొత్త రాజకీయాలు ఎలా ఉండాలనే విషయంపై కూడా వారికి క్లారిటీ లేదు. కానీ ఏదో చేయాలనే తపన, ఉత్సాహం మాత్రం వారిలో ఉంది. అందుకే ముందు ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేస్తే చాలు అనుకుంటున్నారు. తాజాగా మెక్సికోలో అదే జరుగుతోంది. దేశంలో పెరుగిపోతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా వేలాదిమంది జెన్-జడ్ యువత ఆందోళనలు చేపట్టింది. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
అధ్యక్షురాలు రాజీనామా చేయాలి..
మెక్సికో దేశాధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ రాజీనామా చేయాలని అక్కడి యువత డిమాండ్ చేస్తోంది. ఆమె రాజీనామా తమ ప్రధాన అజెండాగా యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టింది. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది యువత. అధ్యక్ష భవనంపై దాడికి కూడా వారు ప్రయత్నించడం ఇక్కడ విశేషం. మెక్సికో అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్లోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఆ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను వారు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఈ గొడవల్లో దాదాపు 120మందికి పైగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిలో 100మంది పోలీసు అధికారులే కావడం గమనార్హం. ఆ స్థాయిలో జెన్-జెడ్ వారిపై విరుచుకుపడింది.
నేపాల్ పరిస్థితి ఏంటి?
నేపాల్ లో ఈ ఏడాది సెప్టెంబర్లో నేపాల్ జెన్-జెడ్ నిరసనలు రాజకీయ సంక్షోభానికి దారి తీశాయి. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నిషేధించడంతో ఈ గొడవలు మొదలయ్యాయి. తీవ్ర అసంతృప్తికి లోనైన ప్రజలు, ముఖ్యంగా జెన్-జెడ్ యువత తిరుగుబాటు చేసింది. ఏకంగా ప్రభుత్వాన్నే కూలదోసింది. సోషల్ మీడియాని నిషేధించిన తర్వాత మొదలైన గొడవలు, చివరకు అవినీతికి వ్యతిరేకం అంటూ టర్న్ తీసుకున్నాయి. దీంతో అక్కడ రణరంగం మొదలై, చివరకు ప్రభుత్వం కూలిపోయింది. పోలీసులకు జెన్-జెడ్ నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 22 మంది మరణించారని అధికారిక సమాచారం కాగా వారి సంఖ్య 74వరకు ఉండొచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. దాదాపు 300మందికి పైగా ఈ గొడవల్లో గాయపడ్డారు. హింస, మరణాలతో సెప్టెంబర్ 9న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయగా, అనంతరం తాత్కాలిక ప్రధానిగా శుశీల కర్కి నేపాల్ ప్రధాని పీఠం ఎక్కారు. అయితే రాజకీయ మార్పు వల్ల నేపాల్ కి ఒరిగిందేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు మెక్సికోలో కూడా ఆందోళనలతో ప్రభుత్వం మారొచ్చు కానీ, దానివల్ల ప్రజలకు కలిగే మేలు ఏంటనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది.
Also Read: జగన్, కేటీఆర్, తేజస్వి, అందరూ ఇంతేనా?