వారసత్వ సమస్యలతో పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా అన్నా చెల్లెళ్ల బంధాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయి. వారసత్వం కొడుకుకేనా, కూతురికి లేదా అనే సమస్యలు తలెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కుటుంబం అయినా, కేసీఆర్ కుటుంబం అయినా, చివరకు లాలూ కుటుంబం అయినా ఈ వారసత్వ ఘర్షణలకు అతీతం కాదు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అన్నా చెల్లెళ్ల రాజకీయ గొడవలతో రోడ్డునపడింది.
कल मुझे गालियों के साथ बोला गया कि मैं गंदी हूँ और मैंने अपने पिता को अपनी गंदी किडनी लगवा दी , करोड़ों रूपए लिए , टिकट लिया तब लगवाई गंदी किडनी .. सभी बेटी – बहन , जो शादीशुदा हैं उनको मैं बोलूंगी कि जब आपके मायके में कोई बेटा – भाई हो , तो भूल कर भी अपने भगवान रूपी पिता को…
— Rohini Acharya (@RohiniAcharya2) November 16, 2025
అసలేం జరిగింది?
బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ కుటుంబంలో రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి. అన్నాదమ్ములు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య ఉన్న విభేదాలు సరేసరి. ఇప్పుడు కొత్తగా లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కుటుంబంపై తిరుగుబాటు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్ తనను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు రోహిణి. రోహిణితోపాటు లాలూకి మరో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారు కూడా ఈ ఎపిసోడ్ తో తీవ్రంగా కలత చెందారు. రోహిణికి జరిగిన అవమానంతో బాధపడిన రాజలక్ష్మి, రాగిణి, చందా.. పాట్నాలో లాలూ ఇంటిని విడిచి ఢిల్లీకి వెళ్లిపోయారు.
తీవ్ర అవమానం..!
ఆమధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కి కిడ్నీ మార్చాల్సి వచ్చింది. అప్పుడు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి ఇచ్చారు. అప్పట్లో అంతా బాగానే ఉంది, ఇప్పుడు బీహార్ లో ఆర్జేడీ ఘోర పరాభవం తర్వాత మళ్లీ ఆ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. తండ్రికి కిడ్నీ ఇవ్వడం ద్వారా తాను కోట్ల రూపాయలు తీసుకున్నానని, పార్టీ టికెట్ తీసుకున్నానని తేజస్వి తనను అవమానించారని చెప్పారు రోహిణి. అప్పట్లో తన భర్త కుటుంబం అనుమతి తీసుకోకుండానే తాను తండ్రికి కిడ్నీ ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఆ త్యాగానికి ఇప్పుడు వెలకట్టారని, తనను అవమానించారని చెప్పారు లాలూ కుమార్తె రోహిణి.
అమ్మాయిలకే అవమానాలా?
ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత కూడా తనను అత్యంత అవమానకరంగా ఇంటి నుంచి పంపించి వేశారని ఆరోపించారు. సోదరుడు కేటీఆర్ తో ఉన్న విభేదాల వల్ల ఆమె ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. జాగృతి పేరుతో వేరు కుంపటి పెట్టుకుని అన్న కేటీఆర్ ని సాధిస్తున్నారు కవిత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంపై కవిత వ్యాఖ్యలు ఆమెలో ఉన్న కోపానికి తాజా నిదర్శనం.
Karma hits back !!! 🙏🙏🙏🙏
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 14, 2025
జగన్ – షర్మిల గొడవ..
తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత సోదరుడు జగన్ వైసీపీ పేరుతో కొత్త పార్టీ పెట్టుకోగా ఆ పార్టీకి మద్దతుగా ప్రజల్లోకి వెళ్లి, జగన్ రాజకీయ పునాది కోసం బాగా కష్టపడ్డారు షర్మిల. కానీ ఆ తర్వాత అన్నతో వచ్చిన విభేదాలతో ఆమె కుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి, ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటూ అన్నపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ, బీహార్.. రాష్ట్రం ఏదయినా వైఎస్ఆర్, కేసీఆర్, లాలూ.. కుటుంబం ఏదయినా అన్న చేతిలో దగా పడ్డ చెల్లెళ్లుగా షర్మిల, కవిత, రోహిణి ముద్రపడిపోయారు. సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోదరుడు ఉండగా తండ్రి వారసురాలిగా కుమార్తె రాజకీయాల్లో ఎదగడం కష్టమేనా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.
Also Read: మెక్సికోలో Gen-Z నిరసనలు.. నేపాల్ సీన్ రిపీట్ అవుతుందా?