Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికుల బస్సు ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురై బస్సులో హైదరాబాద్కు చెందినవారు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి.
సౌదీలో భారతీయ యాత్రికుల బస్సు ప్రమాదం
ఈ ఘటనపై సీఎస్, డీజీపీ నుంచి పూర్తి వివరాలు కోరారు ముఖ్యమంత్రి. ఘటన సమయంలో బస్సులో తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలన్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
అవసరం ఉంటే వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని సూచనలు చేశారు. సీఎం ఆదేశాలపై సీఎస్ రామకృష్ణారావు, ఢిల్లీ లోని కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణ వారికి సంబంధించిన సమాచారం సేకరించి తక్షణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్బ్రాంతి
బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు- 91 79979 59754, 91 99129 19545 ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
ఘటన సమయంలో బస్సులో మొత్తం 45 మంది హజ్ యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై వివరాలు సేకరిస్తున్నామని, రియాద్లోని భారత దౌత్య కార్యాలయం అధికారులతో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలతో ఒవైసీ మాట్లాడినట్టు తెలుస్తోంది.
ALSO READ: గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలు.. ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు
ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీ, విదేశాంగ కార్యదర్శికి పంపారు. మరణించిన యాత్రికుల మృతదేహాలను భారత్కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జైశంకర్ను అభ్యర్థించారు ఎంపీ ఒవైసీ. గాయపడిన యాత్రికులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు హైదరాబాద్ నుంచి 45 మంది యాత్రికులు సౌదీకి వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ ద్వారా 16 మంది, ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్లు బుక్ చేసినట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు వేరే ఏజెన్సీల ద్వారా అక్కడికి వెళ్లినట్టు గుర్తించారు. ఘటన గురించి తెలియగానే ట్రావెల్ ఏజెన్సీలకు చేరుకుంటున్నారు యాత్రికుల బంధువులు.
మృతులు టోలిచౌక్, మల్లేపల్లి జబార్ ఘాట్ వాసులున్నట్లు తెలుస్తోంది. మల్లేపల్లి జబార్ ఘాట్కి చెందినవారు దాదాపు 16 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో 20 మంది మహిళలు, 1 1 మంది చిన్నారులు ఉన్నారు. ఆసిఫ్ నగర్, గోషామహల్ వాసులు యాత్రకు వెళ్లారు.
ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మొత్తం 45 మంది యాత్రకు వెళ్లారు. రాత్రి మదీనాకు 25 కిలోమీటర్ల దూరంగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి మాకు పూర్తి సమాచారం తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు బాధిత బంధువులు. ప్రమాదం గురించి తెలియగానే ఎంపీ అసదుద్దీన్కు ఫోన్ చేశామని చెబుతున్నారు.