Hormuz Strait: ఇరాన్-అమెరికా చర్చలు విఫలం కావడంతో.. యుద్ధం మళ్లీ మొదటికి వచ్చింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని దిగ్బంధించేందుకు ఇరాన్, అమెరికా పోటీ పడుతున్నాయి. హర్మూజ్ ను అమెరికా, దాని మిత్ర దేశాల నౌకలకు అనుమతి లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ అనుమతి ఇచ్చినా.. తమ వద్ద అనుమతి లేదని అమెరికా హెచ్చరిక చేసింది. హర్మూజ్ ను తాము కూడా దిగ్బంధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
పర్షియన్ గల్ఫ్లో అమెరికా నౌకాదళం దిగ్బంధనంతో తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయని టెహ్రాన్ హెచ్చరిస్తుంది. అయితే హర్మూజ్ జలసంధి భారత నౌకలకు తెరిచే ఉంటుందని.. దేశంలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ తెలిపారు. అమెరికా చట్టవిరుద్ధమైన డిమాండ్లు కారణంగానే చర్చలు విఫలమయ్యాయన్నారు. అమెరికా తిరిగి దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఇస్లామాబాద్లో ఇరాన్-అమెరికా చర్చలు విఫలమైన తర్వాత తొలిసారి మాట్లాడిన ఇరాన్ రాయబారి ఫతాలీ.. టెహ్రాన్ స్నేహపూర్వకంగా భావించే ఐదు దేశాలలో న్యూదిల్లీ కూడా ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రత్యేకంగా చెప్పారన్నారు. జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకల అనుమతికి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు ఇప్పటికే జరుగుతున్నాయని చెప్పారు. హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకలను అనుమతించేందుకు ఇక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఫతాలీ తెలిపారు. యూఎస్ ఆంక్షలు తొలగించినప్పటి నుంచి భారత్ ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతుందని ఫతాలీ అన్నారు.
హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకలకు ఏ మాత్రం అంతరాయం కలిగినా క్రూడ్ ఆయిల్ సరఫరా చైన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది.
అమెరికా చట్టవిరుద్ధమైన డిమాండ్లను వదిలిపెట్టి, ఇరాన్ ప్రజల హక్కులను, ప్రయోజనాలను గుర్తిస్తేనే చర్చలు కొనసాగిస్తామని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా ప్రతినిధి బృందం చర్చల కోసం కాకుండా, ఇరాన్ లొంగుబాటు కోసమే వచ్చిందని రాయబారి ఫతాలీ అన్నారు. అమెరికా ఆంక్షలతో ఇరాన్కు ఎదురైన అనుభవాలను ఆయన గుర్తుచేశారు. 2018లో అణు ఒప్పందం నుంచి వాషింగ్టన్ వైదొలగడాన్ని ఫతాలీ గుర్తుచేశారు. ఇరాన్ సామర్థ్యం, అక్కడి ప్రజల సంకల్పం విషయంలో అమెరికా ‘తప్పుడు అంచనా’ వేసిందన్నారు.
పర్షియన్ గల్ఫ్లో అమెరికా దిగ్బంధనం ప్రారంభించడంతో.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని పర్యవసానాలు అమెరికా, ఇరాన్లకు మాత్రమే పరిమితం కాకుండా యాపత్ దేశ్ ప్రజలపై పడుతుందని ఫతాలీ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించడం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే నాశనం చేయడమే అన్నారు. భవిష్యత్తులో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
Also Read : ఇరాన్ చమురు నౌక రూట్ మార్చింది.. ఏడేళ్ల తర్వాత చైనాకు వెళ్లాల్సిన నౌక భారత్ వైపు..
అమెరికా హర్మూజ్ ను దిగ్బంధిస్తే.. ఇరాన్ గల్ఫ్ ఓడరేవులను దిగ్బంధిస్తుందని హెచ్చరించింది. అయితే, ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించిన అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందన్నారు. అంతేగానీ ఇరాన్తో మంచి సంబంధాలున్న గల్ఫ్ దేశాలపై దాడి చేయలేదన్నారు. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంది కాబట్టి ఆయా దేశాలపై దాడి చేసిందన్నారు. చర్చల మధ్యలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఫోన్ చేసి, ఇరాన్-అమెరికా చర్చలను పట్టాలు తప్పించించారని ఇరాన్ పేర్కొంది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో 21 గంటలకు పైగా చర్చలు జరిపిన అనంతరం వాన్స్ ఎలాంటి ఒప్పందం లేకుండా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరిగారని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ చెప్పారు.