Trump Hotel Scam| డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన సొంత వ్యాపారాలు బాగా ఊపందుకున్నాయి. ఇటీవల ఆయన తన క్రిప్టో కరెన్సీ బిజినెస్ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం పాకిస్తాన్ తో పెద్ద ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ హోటల్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా లాభాలు అర్జించవచ్చని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ట్రంప్ హోటల్స్ లో పెట్టుబడులు పెట్టిన వారంతా బాగా నష్టపోయారని.. ఇదంతా మోసమని చాలామంది ఇండియాలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
కర్ణాటకలో 200 మందికి పైగా పెట్టుబడిదారులు సైబర్ పోలీసులను సంప్రదించి, గత 5-6 నెలల్లో సుమారు 2 కోట్ల రూపాయలు మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మోసం ‘ట్రంప్ హోటల్ రెంటల్’ అనే యాప్ ద్వారా జరిగింది. ఈ యాప్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఉపయోగించి, ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు, చిత్రాలతో పెట్టుబడిదారులను మోసం చేశారు. ఈ యాప్ ఇప్పుడు తీసివేయబడింది. ఈ యాప్లో డబ్బు పెట్టుబడి పెడితే త్వరగా ఎక్కువ లాభాలు వస్తాయని, కొన్ని సందర్భాల్లో 100 శాతానికి పైగా లాభం వస్తుందని ఆకర్షించారు.
పోలీసుల అంచనా ప్రకారం.. 800 మందికి పైగా పెట్టుబడిదారులు ఈ మోసంలో బాధితులయ్యారు. కొందరు 10 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. బెంగళూరు, తుమకూరు, మంగళూరు, హుబ్లీ, ధారవాడ, కలబురగి, శివమొగ్గ, బళ్లారి, బీదర్, హావేరి వంటి జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, నార్కోటిక్స్ (CEN) విభాగం అధికారులు ఈ యాప్లో ఆకర్షణీయమైన లాభాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి అవకాశాలను వాగ్దానం చేస్తూ ప్రకటనలు చేసినట్లు తెలిపారు.
ఈ యాప్లో ఒక డాష్బోర్డ్ ఉంటుంది. ఇందులో పెట్టుబడి ద్వారా వచ్చే భారీగా ఆదాయం వస్తున్నట్లు యాప్ రూపకర్తలు చూపించేవారు. పెట్టుబడిదారులు ఇచ్చిన పనులు పూర్తి చేస్తే, డాష్బోర్డ్లో ఆదాయం పెరిగినట్లు కనిపించేది, కానీ వాస్తవంగా డబ్బు ఏమీ చెల్లించేవారు కాదు. హావేరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. చాలా మంది బాధితులు డబ్బు కోల్పోయినప్పటికీ, అందరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు.
ఒక న్యాయవాది ఈ ఏడాది జనవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు సుమారు 6 లక్షల రూపాయలు కోల్పోయారు. హావేరి ఎస్పీ అంశు కుమార్ మాట్లాడుతూ.. ఈ యాప్ ద్వారా జిల్లాలో మోసం కేసులు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మొదట 50 లేదా 100 రూపాయలు పెట్టుబడి పెట్టమని, దానికి 500 రూపాయలు లాభం వస్తుందని చెప్పేవారు. ఇలా నమ్మిన పెట్టుబడిదారులను.. ఎక్కువ డబ్బు పెట్టమని ప్రోత్సహించి, చివరకు మోసం చేశారు.
మే 15న ఒక పెట్టుబడిదారు సిఇఎన్ (CEN) క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, 6 లక్షల రూపాయలు మోసపోయినట్లు తెలిపారు. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఇతరులు కూడా ఫిర్యాదులు చేశారు. అంశు కుమార్ ప్రజలను జాగ్రత్తగా ఉండమని, డబ్బును రెట్టింపు చేస్తామని మోసం చేసే యాప్లను నమ్మవద్దని సూచించారు.
పోలీసులు ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి మోసపూరిత యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: వీర్య దానం.. రిస్కులో 67 మంది పిల్లల ప్రాణాలు, అసలు ఏమైందంటే?
దుబాయ్లో రాత్రికి రాత్రి జెండా ఎత్తేసిన కంపెనీ
మరోవైపు దుబాయ్లోని గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ అనే కంపెనీ రాత్రికి రాత్రే మాయమై, భారతీయ ఇన్వెస్టర్లకు కోట్ల రూపాయల నష్టం కలిగించింది. బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్లో పనిచేసిన ఈ సంస్థ, విదేశీ కరెన్సీలో లాభాలు వస్తాయని చెప్పి డబ్బు సేకరించింది. ఆఫీసు ఖాళీ చేసి, సిబ్బంది పరారయ్యారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ $75,000 (రూ.64 లక్షలు), మరొకరు $230,000 (రూ.2 కోట్లు) కోల్పోయారు. ఈ కంపెనీకి అధికారిక అనుమతులు లేవని తేలింది. పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ గురించి తప్పక తనిఖీ చేయాలి.