Indian Yarn vs Bangladesh Mills: భారత్-బంగ్లాల మధ్య దౌత్య-వాణిజ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయా? భారత్కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నాయా? ఎందుకు భారత నూలుకు డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలని పట్టుబడుతోంది? ఈ విషయంలో వెనక్కి తగ్గకుంటే ఇండస్ట్రీ మూత పడుతుందని హెచ్చరిస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కొత్త డిమాండ్
బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడినట్టు కనిపించడం లేదు. మాజీ ప్రధాని హసీనా తర్వాత అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. ఆనాటి భారత్-బంగ్లాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. దీనికితోడు ఇప్పుడు వాణిజ్య సంబంధాల వంతైంది. భారత్కు వ్యతిరేకంగా అక్కడి వస్త్ర పరిశ్రమ తెర పైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చింది.
భారత నూలుకు బంగ్లాదేశ్లో ఉన్న డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించాలన్నది ప్రధాన డిమాండ్. లేకుంటే వచ్చేనెల అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి దేశంలోని కర్మాగారాలు మూసి వేస్తామని అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి పరిశ్రమ వర్గాలు. భారత నూలుకు సుంకం లేకుండా దిగుమతి సౌకర్యాన్ని ఉప సంహరించుకోకుంటే స్పిన్నింగ్ యూనిట్లలో కార్యకలాపాలు నిలిపేస్తామని దేశీయ మిల్లర్లు హెచ్చరిక.
ఈ నేపథ్యంలో ఆ దేశ వాణిజ్య శాఖ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూకు లేఖ అందినట్లు యూనస్ ప్రభుత్వం తెలిపింది. ఏళ్ల తరబడి సుంకం లేకుండా భారత్ నుంచి చౌకగా నూలును దిగుమతి చేసుకోవడం వల్ల స్థానిక స్పిన్నింగ్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిందని అందులో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ మిల్లులు మూతపడితే దాదాపు ఒక మిలియన్ మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.
డ్యూటీ-ఫ్రీ సౌకర్యం తొలగించకుంటే మూసివేస్తాం
ఇది సామాజిక అశాంతికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని నెలలుగా పెరుగుతున్న ఇంధన ధరలు, గ్యాస్ కొరత వల్ల కార్యకలాపాలు మరింత దిగజారిపోయాయి. చాలామంది మిల్లుల యజమానులు బ్యాంకు రుణాలు చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నట్లు రాసుకొచ్చింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం..2025 ఏడాదిలో బంగ్లాదేశ్ దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువ చేసే 700 మిలియన్ కిలోగ్రాముల నూలును దిగుమతి చేసుకుంటుంది. అందులో 78 శాతం భారత్ నుంచి దిగుమతి అవుతాయి. కాటన్ నూలు ఎక్కువగా భారత్ నుంచి రాగా, పాలిస్టర్ నూలు చైనా నుండి వస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ వర్గాల డిమాండ్ని అక్కడి ఎగుమతిదారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ALSO READ: ఫిలిప్పీన్స్లో ఘోర ప్రమాదం..సముద్రంలో మునిగిన ఫెర్రీ, గల్లంతైనవారి
భారత్ నుంచి దిగుమతి చేసుకున్న నూలుతో పోలిస్తే స్థానికంగా ఉత్పత్తి అవుతున్న నూలు ఖరీదైనవని పేర్కొన్నాయి. దుస్తుల బ్రాండ్లు, నాణ్యత విషయాల్లో ప్రపంచ దేశాలు భారత్లో ఉత్పత్తి అయ్యే నూలుకు ప్రయార్టీ ఇస్తారని నొక్కి వక్కానిస్తున్నారు. భారత్కు ఉన్న డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని నిలిపివేస్తే అక్కడి నుంచి ఎగుమతులు తగ్గుతాయని, దీనివల్ల ప్రపంచ దుస్తుల మార్కెట్లో పోటీని బంగ్లాదేశ్ ఎదుర్కొనడం కష్టమని అంటున్నారు. రాబోయే రోజుల్లో అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆ దేశ వస్త్ర రంగానికి కీలకం కానుంది.