Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఎండలు, ఉక్కపోతతో కాస్త ఇబ్బంది పడుతున్న తరుణంలో.. బంగాళాఖాతం మరోసారి కదిలింది. ఈ నెల 23 లేదా 24వ తేదీల్లో సముద్రంలో ఒక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోనుందని, మందగించిన రుతుపవనాలు మళ్లీ పుంజుకుని విస్తారంగా వర్షాలు కురిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉత్తర, మధ్య భారతంలో భారీ వర్షాలు.. దక్షిణాదిలో ఎలా?
ఈ కొత్త అల్పపీడన ప్రభావం దేశంలోని వివిధ ప్రాంతాలపై విభిన్నంగా ఉండనుంది. ముఖ్యంగా నార్త్, సెంట్రల్, ఈస్ట్ ఇండియా ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండిపోతున్న పంటలకు జీవం పోస్తాయని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఏపీలోని ఈ జిల్లాల ప్రజలు అలర్ట్!
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం ఆంధ్రప్రదేశ్పై స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.
తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం కూల్.. హైదరాబాద్లోనూ వానలు!
ఇటు తెలంగాణలోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే వారం రోజుల్లో అల్పపీడనం బలపడితే రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వర్ష సూచనతో అటు నగరవాసులకు ఉక్కపోత నుండి ఉపశమనం లభించడమే కాకుండా, ఇటు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
Also Read: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే