Iran AI Video: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ రాయబార కార్యాలయం.. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఏఐ వీడియోతో ఇజ్రాయెల్ ను ఎగతాళి చేయడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాను ఏఐ వీడియోతో ఎగతాళి చేసిన తర్వాత దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ సరదా పోస్ట్ ను నెట్టింట పంచుకోవడం గమనార్హం.
దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో ఏఐ వీడియోను పంచుకుంది. ‘టెల్ అవీవ్ (ఇజ్రాయెల్ నగరం) పై మరింత కచ్చితత్వంతో దాడి చేయాలంటే.. దానిమ్మ జ్యూస్ తాగండి’ అంటూ ఆ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చింది. ఏఐ వీడియో విషయానికి వస్తే.. రోడ్డుపై సైనిక ట్రక్కులను నిలిపి ఉంచగా.. పక్కనే ఇరాన్ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి దానిమ్మ రసాన్ని తాగుతూ కనిపించాడు. ఆ సమయంలోనే అతడి వెనుకవైపు మిసైల్ దూసుకెళ్తున్నట్లుగా కూడా చూపించారు. అయితే దానిమ్మ రసం తాగడం వల్ల దృష్టి లోపం తగ్గి.. లక్ష్యాలను మరింత కచ్చితంగా కొట్టవచ్చని ఇరాన్ ఉద్దేశంగా తెలుస్తోంది.
సరిగ్గా రెండ్రోజుల క్రితం కూడా ఇరాన్ సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను విడుదల చేసింది. ‘అందరి కోసం ఒకే ప్రతీకారం’ అనే క్యాప్షన్ తో 54 సెకన్ల నిడివి గల వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది. ఇందులో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న యుద్ధాలు, ఆకృత్యాలు.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఒక క్షిపణి ఢీకొట్టడాన్ని చూపించారు. దీన్ని బట్టి అమెరికా, దాని మిత్రదేశాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామన్న సందేశాన్ని ఇరాన్ ఇచ్చినట్లైంది.
Also Read: Free Biryani Offer: గ్యాస్ సిలిండర్ ఇస్తే.. నెల రోజులు బిర్యానీ ఫ్రీ.. హోటల్ క్రేజీ ఆఫర్!
ఇరాన్ పోస్ట్ చేసిన వరుస ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొందరు దీనిని ఇరాన్ చేస్తున్న సైకలాజికల్ వార్ గా అభివర్ణించారు. మరికొందరు ఇరాన్ చర్యలను తప్పుబట్టారు. తీవ్రమైన యుద్ధం జరుగుతున్న తరుణంగా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పోస్టులు పెట్టి.. ప్రత్యర్థులను కవ్వించడం అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. మెుత్తం మీద యుద్ధంలో ఏఐ వీడియోలు సైతం ఓ భాగం కావడం ఆసక్తిరేపుతోంది.