ఇరాన్ లో ఎక్కడ చూసిన రక్తపాతమే కనిపిస్తోంది.. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఇరాన్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అదుపుతప్పి ప్రస్తుతం తీవ్ర హింసాత్మకంగా మారాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అనధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఇవి అత్యంత భీకరమైన నిరసనలుగా పరిగణించబడుతున్నాయి. ప్రధాన నగరాలైన టెహ్రాన్, మషాద్, ఇస్ఫాహన్లలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు.
పరస్పర ఆరోపణలు..
ఈ భారీ స్థాయిలో జరుగుతున్న మరణాలపై ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకు మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ హింసకు, మరణాలకు విదేశీ శక్తుల మద్దతు ఉన్న ఉగ్రవాదులే కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. శాంతియుత నిరసనకారుల ముసుగులో దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొందరు సాయుధులు దాడులకు పాల్పడుతున్నారని వారు పేర్కొంటున్నారు. అయితే.. మానవ హక్కుల సంఘాలు ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. భద్రతా దళాలు నిరసనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆధారాలతో సహా ఆరోపిస్తున్నారు.
డిజిటల్ చీకటిలో ఇరాన్..
నిరసనకారులు ఒకచోట చేరకుండా దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీనివల్ల మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు పనిచేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయని, చాలా చోట్ల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంలో జాప్యం జరుగుతోందని స్థానిక వర్గాల ద్వారా తెలుస్తోంది.
అమెరికాకు ఇరాన్ వార్నింగ్..
మరోవైపు.. అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ తీవ్రస్థాయిలో హెచ్చరించింది. తమ అంతర్గత విషయాల్లో విదేశీ శక్తుల ప్రమేయాన్ని సహించేది లేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, నిరసనకారులపై జరుగుతున్న హింసను ఆపాలని ఐక్యరాజ్యసమితి, ఇతర పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆర్థిక సంక్షోభం, కఠినమైన నిబంధనలతో విసిగిపోయిన సామాన్య ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడుతుండటంతో ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం నిప్పుల కుంపటిలా మారింది.
ALSO READ: Techie Murder Case: మహిళా టెక్కీ మృతి కేసులో ట్విస్ట్.. కోరిక తీర్చలేదని ఇంటర్ విద్యార్థి ఘాతుకం!