Techie Murder Case: బెంగళూరులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట అగ్నిప్రమాదంగా భావించిన ఈ ఘటన, వాస్తవానికి లైంగిక దాడికి లొంగలేదని జరిగిన దారుణ హత్యగా పోలీసులు తేల్చారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (34) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తూ, రామ్మూర్తినగర పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లో తన స్నేహితుడితో కలిసి ఓ ఫ్లాట్లో నివసిస్తోంది.
ఈ నెల 3న షర్మిల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్లాట్లో మంటలు చెలరేగాయని, ఆమె అందులో చిక్కుకుని మరణించిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు కీలక ఆధారాలను అందించింది. ఆమె శరీరం కాలకముందే చేతులపై గాయాలు ఉన్నాయని, ఆమె నిప్పు వల్ల కాకుండా ఊపిరాడక మరణించిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, పక్కనే నివసించే 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి కర్నల్ కురై కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి.
పోలీసుల విచారణలో నిందితుడు కురై తన నేరాన్ని అంగీకరించాడు. ఘటన జరిగిన రోజు షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయం చూసి, కిటికీలోంచి ఆమె గదిలోకి ప్రవేశించినట్లు తెలిపాడు. ఆమెను లైంగికంగా లొంగిపోవాలని ఒత్తిడి చేయగా, షర్మిల గట్టిగా అరుస్తూ అతడిని తోసివేసింది. దీంతో ఆవేశానికి గురైన నిందితుడు వంటగదిలోని కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కింద పడిపోయాక, కేకలు వేయకుండా ఉండేందుకు మొహంపై దిండును గట్టిగా నొక్కి పట్టడంతో షర్మిల ఊపిరాడక ప్రాణాలు విడిచింది.
హత్య అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితుడు కిరాతక ప్లాన్ వేశాడు. రక్తపు మరకలున్న షర్మిల దుస్తులను తొలగించి, అదే గదిలో వాటికి నిప్పంటించాడు. తద్వారా ఇది అగ్నిప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించాడు. గదిలో మంటలు వ్యాపించడంతో కిటికీలోంచి దూకి తన ఫ్లాట్లోకి పారిపోయాడు. కేవలం 18 ఏళ్ల వయసున్న విద్యార్థి ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Read Also: పోలీసుస్టేషన్లో దారుణం.. అందరూ చూస్తుండగా, భార్యని కాల్చిన భర్త, యూపీలో ఘోరం