Iran Earthquake: పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ను వరుస విపత్తులు వెంటాడుతున్నాయి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ దళాలు, ఇరాన్ ను వైమానిక దాడులతో బాంబులతో అతలాకుతలం చేస్తుండగా, ఇప్పుడు ప్రకృతి ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఇరాన్లోని గెరాష్ ప్రాంతం కేంద్రంగా సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.3గా నమోదైనట్లు జియాలజిస్టులు వెల్లడించారు. ఇప్పటికే యుద్దంతో సతమతమవుతున్న ప్రజలు మరింత బెంబేలెత్తిపోతున్నారు.
భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో గెరాష్ పరిసర ప్రాంతాల్లోని భవనాలు కూలిపోయాయి. ఇప్పటికే క్షిపణి దాడులతో బలహీనపడిన కట్టడాలు ఈ భూకంపం ధాటికి నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. భూకంపం ధాటికి ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగానే ఉండే అవకాశం ఉందని స్థానిక యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఒకవైపు శత్రుదేశాల దాడుల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేస్తున్న ప్రజలకు ఈ భూకంపం ఊపిరి సలపకుండా చేస్తోంది. ఆసుపత్రులు ఇప్పటికే గాయపడిన సైనికులతో నిండిపోగా.. ఇప్పుడు భూకంప బాధితుల తాకిడి పెరగడంతో వైద్య సేవలు అందించడం సవాలుగా మారింది. గెరాష్ ప్రాంతంలో సమాచార వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో నష్టం తీవ్రతను అంచనా వేయడం కష్టమవుతోంది.
ఇరాన్లో యుద్ధం వల్ల సంక్షోభం వచ్చిన సమయంలోనే ఈ భూకంపం రావడం అక్కడి ప్రజల కష్టాలను రెట్టింపు చేసింది. శిథిలాల తొలగింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. బాంబుల సెగకు భూకంపం తోడవడంతో ఇరాన్ గడ్డపై విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రపంచ దేశాల నుండి సాయం అందే పరిస్థితులు కూడా యుద్ధం కారణంగా క్లిష్టంగా మారాయి.