Iran Warning: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు తీవ్రమవుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇస్లామాబాద్ చర్చలు విఫలంతో ఇరాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది అమెరికా. పరిస్థితి గమనించిన ఇరాన్, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ ఓడరేవులపై దిగ్బంధనం విధించాలన్న అమెరికా ప్రణాళికలను విమర్శించింది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే గల్ఫ్ ప్రాంతంలో సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది.
అమెరికాను ఘాటుగా హెచ్చరించిన ఇరాన్
ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ పోర్టులకు వెళ్లడం, అక్కడి నుంచి వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీనిపై ఇరాన్ ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. ఈ చర్యను సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది. ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ప్రకటనను ఆదేశ ప్రభుత్వ మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ ప్రచారం చేసింది.
పర్షియన్ గల్ఫ్-ఒమన్ సముద్రంలో సముద్ర భద్రతను సమిష్టిగా కాపాడాలని కోరింది. తమ ప్రాదేశిక జలాల్లో దేశ హక్కులు, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం ఇస్లామిక్ రిపబ్లిక్ సాయుధ దళాలకు చట్టపరమైన విధి అని ఆ మీడియా సంస్థ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్-ఒమన్ సముద్రంలోని ఓడరేవుల భద్రత విషయంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాలు రెడీగా ఉంటాయని స్పష్టం చేసింది.
మా పోర్టులకు ముప్పు వాటిల్లితే, గల్ప్లో ఏ పోర్టు సేఫ్గా ఉండదు
ఒకవేళ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఓడరేవుల భద్రతకు ముప్పు వాటిల్లితే.. పర్షియన్ గల్ఫ్- ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు సురక్షితంగా ఉండదని ప్రసారం చేసింది. ఇరాన్ తన జలాల్లో భద్రతను అమలు చేయడం కొనసాగిస్తుందని ఆ ప్రకటన తేల్చిచెప్పింది. అలాగే శత్రువులతో సంబంధం ఉన్న నౌకలకు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతించబోమని తెలిపింది.
ఇరాన్ అధికారులు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఇతర నౌకలకు ప్రయాణానికి అనుమతి ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ జలసంధిని దిగ్బంధనానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.
ALSO READ: ఇరాన్తో చర్చలు విఫలం.. హర్మూజ్ జలసంధి మూసివేయాలని ట్రంప్ సంచలన ఆదేశం!
ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరిగే హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ఎగుమతులు నిలిచిపోయి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.