Israel Attack Near Pakistan Embassy: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమవుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం సమీపంలో గురువారం (మార్చి 26) ఇజ్రాయెల్, అమెరికా దళాలు వైమానిక దాడులు జరిపాయి. దీనిపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ దాడులు జరగడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది.
టెహ్రాన్ మధ్యభాగంలో ఇజ్రాయెల్, అమెరికా జరిపిన ఈ తాజా వైమానిక దాడులు పాకిస్థాన్ రాయబారి నివాసం, ఎంబసీ కాంపాక్ట్ కు అత్యంత సమీపంలో జరిగాయి. పేలుళ్ల ధాటికి రాయబార కార్యాలయ భవనంతో పాటు పరిసరాల్లోని కట్టడాలు తీవ్రంగా కంపించాయి. అదృష్టవశాత్తూ పాక్ రాయబారికి ఎటువంటి ప్రాణాపాయం కలగలేదు, ఆయన సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అయితే, దౌత్య కార్యాలయాల రక్షణపై అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ ఈ సాహసానికి ఒడిగట్టడం ఉద్రిక్తతలను పెంచింది.
“ఇజ్రాయెల్ ఒక్కటి గుర్తుంచుకోవాలి.. పాకిస్థాన్ అంటే ఖతార్ కాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే మా దౌత్యవేత్తలకు హాని కలిగితే.. మేము వారి నరకం చూపిస్తాం” అంటూ పాకిస్థాన్ ప్రభుత్వం అనుబంధ సంస్థ పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఫోరమ్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడులను పాక్ ఒక సవాల్గా తీసుకున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.
అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ దౌత్యపరమైన చర్చలు జరుపుతోంది. ఇటువంటి కీలక సమయంలో పాక్ ఎంబసీ లక్ష్యంగా లేదా దానికి అతి సమీపంలో దాడులు జరగడం వల్ల ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు పెద్ద విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే పాకిస్థాన్ను ఈ యుద్ధంలోకి లాగాలని ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా, ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నుంచి పాకిస్థాన్లోని కరాచీ వైపు ప్రయాణిస్తున్న సెలీన్ అనే కంటైనర్ నౌకను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నౌక జలసంధిలోకి ప్రవేశించకుండా వెనక్కి మళ్లాలని ఇరాన్ ఆదేశించింది. దీనికి ప్రధాన కారణం రవాణా అనుమతి లేకపోవడమేనని ఇరాన్ స్పష్టం చేసింది.
ప్రస్తుతం టెహ్రాన్లో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. పాకిస్థాన్ చేసిన ఈ ఘాటు హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన తదుపరి అడుగు ఎలా వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ కూడా ఈ దాడులను తన సార్వభౌమాధికారంపై దాడిగా పరిగణిస్తూ ప్రతిదాడులకు సిద్ధమవుతోంది.
Read Also: పిజ్జా ఆర్డర్లు పెరిగితే.. ఏదో దేశానికి మూడినట్లే.. ఏంటీ పెంటగాన్ పిజ్జా ఇండెక్స్?