IDF Warns Iran Railway: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు రోజు రోజుకు ఊహించని రీతిలో భయంకరమైన మలుపులు తిరుగుతున్నాయి. సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని మూడు ప్రధాన విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), నేడు తన వ్యూహాన్ని ఇరాన్ రైల్వే వ్యవస్థ వైపు మళ్లించాయి. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న పౌరులు రైళ్లు.. రైల్వే మార్గాలకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం తమ అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక హెచ్చరికను జారీ చేసింది.
“మీ భద్రత దృష్ట్యా, ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 21:00 గంటల (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల) వరకు ఇరాన్ అంతటా రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలని మేము కోరుతున్నాము.” అని సైన్యం పేర్కొంది. రైళ్లలో ప్రయాణించడం.. రైల్వే పట్టాల సమీపంలో ఉండటం మీ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్లోని మషద్ నగరంలో రైల్వే కార్యకలాపాలు నిలిపివేయబడినట్లు ఫార్స్ (Fars) వార్తా సంస్థ నివేదించింది. భద్రతాపరమైన ముప్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, రైల్వేల మూసివేతపై ఇరాన్ ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. రవాణా వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ హెచ్చరికల ద్వారా అందుతున్నాయి.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన దాడుల అనంతరం ఇరాన్, ఇజ్రాయెల్ సహా అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య నిరంతరం దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తాజా హెచ్చరికలో నిర్దిష్ట ప్రాంతాలు లేదా రైల్వే మార్గాల గురించి పేర్కొనకపోవడం వల్ల, ముప్పు ఏ రూపంలో ఉంటుందనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఇజ్రాయెల్ హెచ్చరికపై ఇరాన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Read Also: Iran: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?