PM Netanyahu: తనపై వస్తున్న రకరకాల వార్తల నేపథ్యంలో నేరుగా మీడియా ముందుకొచ్చారు ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు. ఇరాన్పై తాము జరిపిన దాడులతో ఆ దేశానికి భారీగా నష్టం వాటిల్లిందన్నారు. అంతేకాదు యురేనియం శుద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులు తయా రుచేసే సామర్థ్యం ఆ దేశానికి లేదని తేల్చి చెప్పేశారు.
తాను బతికే ఉన్నాను.. ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు
ఇరాన్తో జరుగుతున్న యుద్ధం మూడు వారాలు పూర్తి చేసుకుంది. నాలుగో వారంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో మీడియా ముందుకొచ్చారు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. తన మరణంపై వచ్చిన వార్తలపై ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. తాను బతికే ఉన్నానంటూ మాట్లాడారు.
ఇరాన్ను ఇప్పుడు ఎవరు పాలన చేస్తున్నారు అనే విషయం తమకు తెలియదన్నారు. ఇరాన్ కొత్త సుప్రీంగా మొజ్తాబా ఖమేనీని ప్రకటించినప్పటికీ ఆయన బహిరంగంగా కన్పించలేదన్నారు. ఆ దేశం నేతలు, సైనిక దళాల మధ్య చీలిక వచ్చిందన్నారు. ఈ యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్ గెలుస్తున్నాయని, ఇరాన్ పూర్తిగా నాశనం అవుతుందన్నారు.
మూడు టార్గెట్లు పూర్తి.. ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు
ఇరాన్పై తాము చేసిన యుద్ధం గురించి వివరించారు. కేవలం మూడు లక్ష్యాలు సాధించేందుకు చేపట్టినట్లు తెలిపారు. ఇరాన్ నుంచి అణు ముప్పును తొలగించడం, రెండోది సైనిక సామర్థ్యాలను అణగ దొక్కడం, మూడోది ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం మా ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. మా దాడులతో ఇరాన్కు భారీగా నష్టం చేకూర్చామన్నారు. క్షిపణి నిల్వలు, వాటిని ఉత్పత్తి పరిశ్రమలను చావు దెబ్బ కొట్టామన్నారు.
గురువారం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై చేసిన దాడుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ సొంతంగా దానిపై దాడి చేసిందన్నారు పీఎం. ఇలాంటి దాడులు చేయవద్దని డొనాల్డ్ ట్రంప్ కోరినట్లు వెల్లడించారు. ఆయన మాటలను తాము తప్పక పాటిస్తామని, ఈ యుద్ధంలోకి అమెరికాను ఇజ్రాయెల్ లాగిందంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు నెతన్యాహు.
ALSO READ: ఇరాన్ టార్గెట్ ఫిక్స్.. చమురు క్షేత్రాల తర్వాత, నెక్ట్స్ ఇంటర్నెట్ కేబుల్స్?
ట్రంప్కు ఏం చేయాలో ఎవరైనా చెప్పగలరా? ఎదురు ప్రశ్నించారు. అమెరికాకు ఏం మంచిదో దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు కేవలం వైమానిక దాడులతో యుద్ధం జరిగిందన్నారు. హర్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని బెదిరించేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తోందన్నారు. కానీ అది ఏమీ ఫలించదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.
https://twitter.com/bigtvtelugu/status/2034814861453271439