North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు ఏ (Kim Ju Ae) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ 13 ఏళ్ల బాలిక.. తన తండ్రితో కలిసి ఒక సైనిక శిక్షణలో పాల్గొనటమే కాకుండా స్వయంగా యుద్ధ ట్యాంకును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో చిన్నకూతురు డ్రైవింగ్ చేస్తుండగా యుద్ధ ట్యాంక్ పై కూర్చొని కిమ్ మామ షికారు చేశారంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఉత్తర కొరియాలో గురువారం (మార్చి 19) జరిగిన సైనిక విన్యాసాల్లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు ఆ దేశ అధికారిక వార్త సంస్థ ‘KCNA’ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సదరు వార్త సంస్థ రిలీజ్ చేసిన ఫొటోల్లో.. తండ్రీకూతుళ్లు ఎంతో సందడిగా కనిపించారు. నల్లని లెదర్ జాకెట్ ధరించిన కిమ్ ట్యాంక్ పై కూర్చొని ఉండగా.. ఆయన కుమార్తె కిమ్ జు ఏ ట్యాంక్ నడుపుతున్నట్లుగా ఫొటోలో కనిపించారు. ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు సైతం దర్శనమిచ్చింది.
ఈ విన్యాసాల సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. సైన్యం ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. శత్రువుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొని.. దేశానికి అండగా ఉండేందుకు ప్రతీ సైనికుడు పూర్తి సన్నద్దతతో ఉండాలని కిమ్ దిశానిర్దేశం చేశారు.
ఇదిలా ఉంటే కిమ్ కుమార్తె జు ఏ.. గత కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. కిమ్ వారసురాలు ఆమెనంటూ అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే 13 ఏళ్ల వయసులోనే కిమ్ జు ఏ.. సైనిక కార్యక్రమాలు, మిస్సైల్ లాంచ్లు, ఆర్మీ ఫ్యాక్టరీల సందర్శనల్లో తండ్రితో పాటు పక్కనే కనిపిస్తున్నారు. కిమ్ తన కుమార్తెను ఉత్తర కొరియా తదుపరి అధినేత్రిగా తీర్చిదిద్దుతున్నారనే వాదనలకు ఈ ఘటనలు బలం చేకూరుస్తున్నాయి.
Also Read: TCL MicroLED TV: చరిత్రలో ఫస్ట్ టైమ్.. కోటి రూపాయల టీవీపై.. ఊహకందనంత తగ్గింపు!
మరోవైపు కిమ్ జు ఏ.. గత కొద్ది వారాలుగా పిస్టల్ షూటింగ్ సైతం ప్రాక్టీస్ చేస్తోంది. ఇందుకు సంబంధించి దృశ్యాలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు రాకెట్ లాంచ్లను పర్యవేక్షించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉండటం గమనార్హం. మరోవైపు ఆమెను కిమ్ వారసురాలిగా ప్రకటించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ (National Intelligence Service) సైతం అంచనా వేస్తోంది.
Also Read: Automatic Curry Makers: ఏఐ స్మార్ట్ కుక్కర్లు.. పచ్చి కూరగాయలు వేస్తే చాలు.. మధురంగా వండేస్తాయ్!