TCL MicroLED TV: టీసీఎల్ (TCL) కంపెనీ తమ సరికొత్త మైక్రో-ఎల్ఈడీ (MicroLED) టీవీల ధరలను భారీగా తగ్గించి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా మైక్రో-ఎల్ఈడీ టీవీలు కోట్లలో ధర పలుకుతుంటాయి. కానీ టీసీఎల్ తాజాగా చైనాలో విడుదల చేసిన 163 అంగుళాల మైక్రో-ఎల్ఈడీ టీవీల ధరలను గతంతో పోలిస్తే దాదాపు మూడింట ఒక వంతు తగ్గించింది.
టీసీఎల్ తన లేటెస్ట్ మైక్రో-ఎల్ఈడీ టీవీలను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో TCL Max163M వేరియంట్ ధరను 2,49,999 యువాన్లుగా నిర్ణయించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.29 లక్షలకు సమానం. మరోవైపు TCL Max163M Pro వేరియంట్ ధరను 349,999 యువాన్లుగా కంపెనీ ప్రకటించింది. అంటే సుమారు రూ. 41 లక్షలు అన్నమాట.
అయితే గతంలో టీసీఎల్ ఇదే సైజులో విడుదల చేసిన ‘X11H Max’ మోడల్ ధరను 8,00,000 యువాన్లుగా పేర్కొంది. అంటే సుమారు రూ.92 లక్షలు అన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త మోడళ్ల ధరలు మాత్రం ప్రీవియస్ మోడళ్ల కంటే భారీ ఎత్తున తగ్గటం గమనార్హం. ఇప్పటివరకూ అందనంత దూరంలో ఉన్నట్లు అనిపించిన మైక్రో-ఎల్ఈడీ టీవీలు.. ధర తగ్గింపు నేపథ్యంలో సేల్స్ పెరిగే అవకాశముందని టీసీఎల్ కంపెనీ అంచనా వేస్తోంది.
ఈ భారీ మైక్రో ఎల్ఈడీ టీవీలు కేవలం సైజులోనే కాకుండా.. టెక్నాలజీ పరంగా కూడా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. 163 అంగుళాల భారీ 4K స్క్రీన్ తో పాటు ఏకంగా 10,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఇది కలిగి ఉంది. అలాగే ఇది 100% BT.2020 కలర్ గ్యామట్తో అత్యంత సహజమైన రంగులను స్క్రీన్ పై చూపిస్తుంది. ప్రో మోడల్లో 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్కు కూడా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ లేటెస్ట్ మైక్రో – ఎల్ఈడీ టీవీలు.. దాదాపు 1,00,000 గంటల పాటు పని చేస్తాయని కంపెనీ పేర్కొంది.
Also Read: Wonderchef Chef Magic: రోబోటిక్ స్మార్ట్ కుక్కర్.. 500 పైగా వంటకాలు.. రెస్టారెంట్ స్టైల్ ఘుమఘుమలు!
మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీని ‘OLED కిల్లర్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది OLED లాగే అద్భుతమైన బ్లాక్ లెవల్స్ ఇస్తూనే అంతకంటే ఎక్కువ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే స్క్రీన్ బర్న్ ఇన్ సమస్యలు వీటిలో ఉండవు. ఇప్పటికే శాంసంగ్ (Samsung), ఎల్జీ (LG) వంటి కంపెనీలు.. మైక్రో-ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేయగా.. వీటి ధరలు రూ. కోటికి పైగానే ఉన్నాయి. టీసీఎల్ ఈ ధరలను తగ్గించడంతో భవిష్యత్తులో ఈ టెక్నాలజీ సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Automatic Curry Makers: ఏఐ స్మార్ట్ కుక్కర్లు.. పచ్చి కూరగాయలు వేస్తే చాలు.. మధురంగా వండేస్తాయ్!