Balochistan: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక లేఖ సంచలనం సృష్టిస్తోంది. ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ పేరుతో వైరల్ అవుతున్న ఆ లేఖ.. పాకిస్థాన్ ముక్కలైందని, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించిందని పేర్కొనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, నిజంగానే పాక్ ముక్కలైందా? బలూచిస్తాన్ విడిపోయిందా?
వైరల్ లేఖ వెనుక అసలు నిజం
వైరల్ అవుతున్న లేఖలో బలూచ్ తిరుగుబాటుదారులు 85 శాతం భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని, సొంత జెండా, జాతీయ గీతాన్ని ప్రకటించుకున్నారని ఉంది. కానీ అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి గానీ, ఏ ఇతర దేశం గానీ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. అధికారికంగా పాకిస్థాన్ ముక్కలు కాలేదు. కానీ, ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వెనుక దశాబ్దాలుగా నలుగుతున్న బలూచ్ ప్రజల ఆక్రందన, ఆకలి, తిరుగుబాటు దాగి ఉన్నాయి.
Also Read: సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్కు తప్పిన పెద్ద ప్రమాదం!
బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది?
భౌగోళికంగా బలూచిస్తాన్ సహజ వనరులు, బంగారు గనులతో విలసిల్లే సంపన్న భూమి. కానీ, అక్కడి సంపదను పాక్ పాలకులు దోచుకుంటూ, స్థానిక ప్రజలను తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తున్నారు. దీనికి తోడు చైనా నిర్మిస్తున్న సీపెక్ ప్రాజెక్టుల వల్ల బలూచ్ ప్రజలు తమ స్వంత నేలపైనే పరాయివాళ్లుగా మారుతున్నారు. ఈ అణిచివేత, నరమేధానికి వ్యతిరేకంగానే ‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ’ వంటి సాయుధ సంస్థలు కొన్నేళ్లుగా పాక్ సైన్యంపై గెరిల్లా దాడులు చేస్తున్నాయి.
పాక్ వక్రబుద్ధి.. భారత్ స్పందన
ఎప్పటిలాగే తన దేశంలోని అంతర్గత విఫలతను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ కుక్క తోక వంకర సామెతను నిజం చేస్తోంది. బలూచిస్తాన్ తిరుగుబాటు వెనుక భారత నిఘా సంస్థ ‘రా’ హస్తం ఉందంటూ పాత పల్లవినే అందుకుంది. దీనిపై భారత్ ఎప్పుడో తన పంథాను స్పష్టం చేసింది. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. అక్కడ జరుగుతున్న అంతర్గత తిరుగుబాట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. పాక్ తన తప్పులను ఇతరులపై నెట్టేయడం మానుకోవాలని స్పష్టం చేసింది.
Also Read: తెలంగాణ టూరిజంపై ఎల్ నినో దెబ్బ.. జూలై నెలలోనూ ఎండిపోయిన జలపాతాలు