Madhapur Murder: హైదరాబాద్లోని మాదాపూర్లో సంచలనం సృష్టించింది సెనెపల్లి భాస్కర్ హత్య కేసు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు భాస్కర్, అదే గ్రామానికి చెందిన BC సామాజిక వర్గానికి చెందిన యువతి గతంలో ప్రేమించుకున్నారు. అయితే, వీరి కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాదాపు మూడేళ్ల క్రితం ఆ యువతికి ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా మరొకరితో పెళ్లి జరిపించారు. అయితే, పెళ్లయినప్పటి నుంచీ.. భర్తతో తరచూ గొడవలు జరగడంతో ఆమె విడాకులు తీసుకుంది.
భాస్కర్ తమ కూతుర్ని పెళ్లయిన తర్వాత కూడా వేధించాడని అంటారు నిందిత కుటుంబ సభ్యులు. ఫోన్లు చేస్తూ తరచూ ఇబ్బంది పెట్టాడని ఆరోపించాడు అమ్మాయి తండ్రి రాజు. గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో భాస్కర్ పై కంప్లయింట్ చేసి కౌన్సెలింగ్ కూడా ఇప్పించినట్టు చెబుతున్నాడీయన. విడాకులు తీసుకున్న తర్వాత ఆమే భాస్కర్కు ఫోన్లు చేసిందని అంటారు మృతుడి బంధువులు. నగలు, సామాన్లతో వచ్చేస్తానని, తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని, ఆమె భాస్కర్పై ఒత్తిడి తెచ్చిందని అంటారు మృతుడి తరఫు వారు. ఇదే అంశంపై భాస్కర్ సోదరుడు మధు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. భాస్కర్ ఆమెకు దూరంగా ఉండటానికే హైదరాబాద్ వచ్చి మాదాపూర్లోని ఒక హోటల్లో కుక్గా పనికి చేరాడని అంటారు వీరు.
అసలు ప్లాన్ ఎవరిది? భాస్కర్ను ఎలా ట్రాప్ చేశారు? ఈ దారుణ హత్య వెనుకున్న స్కెచ్ ఎవరిదీ? అంటే, ఆమె తండ్రి రాజు యాదవ్, ఆమె మేనమామ కుమారస్వామిదిగా గుర్తించారు పోలీసులు. భాస్కర్ ఎక్కడున్నాడో అమె నుంచే తెలుసుకున్నారని ఆరోపిస్తున్నారు మృతుడి బంధువులు. ఆమే, భాస్కర్ లొకేషన్ను చేరవేసిందని అంటారు. దీని ఆధారంగానే వారు హైదరాబాద్ చేరుకున్నారని అంటున్నారు మృతడి కుటుంబ సభ్యులు.
Also read: భారత్లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!
జూలై 14 నాటి రాత్రి హన్మకొండ నుంచి రాజు, కుమారస్వామి మాదాపూర్ వచ్చారు. రాత్రి పదకొండున్నర పన్నెండు గంటల సమయంలో భాస్కర్ పనిచేసే హోటల్ దగ్గరకు వెళ్లి, అతడిని బయటకు పిలిచారు. ఒక్కసారిగా కర్రలు, కత్తులతో భాస్కర్పై విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన భాస్కర్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు చెప్పారు డాక్టర్లు.
ప్రస్తుతం మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితులైన రాజు, కుమారస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కులాంతర వివాదం కారణంగా జరిగిన పరువు హత్యగా చెబుతున్నారు భాస్కర్ కుటుంబ సభ్యులు. న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాయి దళిత సంఘాలు. బుధవారం ఉప్పరపల్లిలో బంధుమిత్రుల మధ్య భాస్కర్ అంత్యక్రియలు జరిగాయి. గ్రామంలో మరెలాంటి గొడవలు జరక్కుండా- గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
Also read: Mudragada Legacy: జగన్ పాడె మోయడం వెనుక అసలు స్కెచ్ అదేనా?.. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!