Nepal jeep accident: నేపాల్లోని రోల్పా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఒక జీపు అదుపుతప్పి సుమారు 700 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయంగా మారాయి. దీంతో వాహనం టైర్లు జారి కొండ కిందికి పడిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బాధితులంతా జల్జలా ప్రాంతంలో జరగనున్న వైశాఖ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పండగ వేళ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వేడుకలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అయితే ఆ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, లోయలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మృతదేహాలను వెలికితీయడం అధికారులకు సవాలుగా మారింది. నేపాల్లోని కొండ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటం, దానికి తోడు వర్షాలు తోడవడంతో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also: మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి