RS Praveen: ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్రమంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను ఇరికించే కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2024 మార్చిలో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు ఇప్పటికీ ధారావాహిక వలే కొనసాగుతూనే ఉందని అన్నారు. ఇప్పటి వరకు 350 మంది సాక్షులను విచారించినా ఛార్జ్ షీట్ మాత్రం ఫైల్ చేయలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండు సార్లు సిట్ ఏర్పాటు చేశారని, ఇది కేవలం రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక ఆధారాలతో సరైన సాక్ష్యాలతో విచారణ జరపాల్సిన కేసులో కావాలని కొంత మంది పాత నేరస్థుల చేత రాజకీయ నాయకుల పేర్లను చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారని మండిపడ్డారు. 1885 ఇండియన్ టెలిగ్రాం చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. ట్యాపింగ్ చట్టబద్ధమని అన్నారు. ఎందుకు ట్యాపింగ్ చేస్తున్నారన్న వివరాలు రాజకీయ నాయకులకు తెలియదని స్పష్టం చేశారు.
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణమైన అంశమని, ఏ ప్రభుత్వమైనా ట్యాపింగ్ చేస్తుందని చెప్పారని గుర్తు చేశారు. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో గత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే చట్టబద్దంగా విచారణ జరపాలని అన్నారు. అలా కాకుండా లేని ఆధారాలు సృష్టించి రాజకీయ నాయకులను ఇరికించాలని చూడడం సరైంది కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 గా పేర్కొన్న టి.ప్రభాకర్ రావు అనే మాజీ పోలీస్ అధికారిని 19 రోజుల పాటు విచారణ పేరుతో మానసికంగా హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బు.. దర్యాప్తులో సంచలనాలు!
టి. ప్రభాకర్ రావుకు బెయిల్ రాకుండా ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించినా.. సుప్రీం కోర్టు ప్రభాకర్ రావుకు అనుకూలంగా తీర్పును ఇచ్చిందని ఆర్.ఎస్. ప్రవీణ్ గుర్తు చేశారు. ప్రభాకర్ రావును ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆయన నిజాలనే చెప్పారన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, కాళేశ్వరం వంటి కేసుల్లో తప్పుడు ఆధారాలు, ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం అక్రమ కేసులు పెడుతున్న అధికారులపై కూడా భవిష్యత్ లో కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. తప్పుడు ఆధారాలు సృష్టిస్తే తర్వాత మూల్యం తప్పదన్నారు. కేసీఆర్, హరీష్ వంటి వారిని ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా భయపడబోమని ఆర్.ఎస్. ప్రవీణ్ స్పష్టం చేశారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.