Norovirus Outbreak: విహార యాత్ర అంటేనే ఆహ్లాదం, ఉల్లాసం. కానీ, ఇటీవల క్రూయిజ్ నౌకల్లో వరుసగా బయటపడుతున్న వైరస్ కేసులు పర్యాటకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ‘యాంబిషన్’ అనే లగ్జరీ క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ (Norovirus) కలకలం రేపింది. బెల్ఫాస్ట్ నుండి స్పెయిన్కు సుమారు 1700 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఈ నౌక, వైరస్ వ్యాప్తి కారణంగా ఫ్రాన్స్లోని బోర్డెక్స్ పోర్టులో నిలిచిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికులలో అనారోగ్య లక్షణాలు కనిపించడంతో విహార యాత్ర కాస్తా విషాద యాత్రగా మారింది.
అస్వస్థతకు గురైన ప్రయాణికులు..
నౌక ప్రయాణంలో ఉండగానే సుమారు 50 మంది ప్రయాణికులు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఈ లక్షణాలు వేగంగా వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన ఫ్రెంచ్ ఆరోగ్య అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నౌకను తాత్కాలికంగా క్వారంటైన్ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించగా అది ‘నోరోవైరస్’ అని తేలింది. ఈ వైరస్ చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది, అందుకే అధికారులు నౌకలో కఠినమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.
92 ఏళ్ల వృద్ధుడి మృతి..
ఈ ఉత్కంఠ భరిత పరిస్థితుల మధ్య మే 10న నౌకలో ఒక 92 ఏళ్ల వృద్ధుడు మరణించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, సదరు నౌక యాజమాన్య సంస్థ ‘అంబాసిడర్ క్రూయిజ్ లైన్’ దీనిపై వివరణ ఇస్తూ.. ఆ వృద్ధుడి మరణానికి, ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మృతుడిలో ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని, ఆయన సహజ కారణాలతోనే మరణించారని వెల్లడించి ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నం చేసింది.
నోరోవైరస్ vs హంటా వైరస్.. భేదం ఏంటి?
ఇటీవల కాలంలో మరో నౌకలో ‘హంటా వైరస్’ కేసులు కూడా వెలుగు చూశాయి. అయితే, ఇప్పుడు యాంబిషన్ నౌకలో వ్యాపిస్తున్న నోరోవైరస్కు, హంటా వైరస్కు ఎటువంటి సంబంధం లేదని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పారు. నోరోవైరస్ అనేది ప్రధానంగా కలుషితమైన ఆహారం, నీరు లేదా సోకిన వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. దీనిని సాధారణంగా ‘స్టమక్ ఫ్లూ’ అని పిలుస్తారు. దీని ప్రభావం కొన్ని రోజులు మాత్రమే ఉన్నప్పటికీ, వృద్ధులు, పిల్లల విషయంలో ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
యాత్రికులకు ఊరట.. ఐసొలేషన్లో చికిత్స
ప్రస్తుతం ఎటువంటి వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను బోర్డెక్స్ పోర్టులో దిగేందుకు అధికారులు అనుమతించారు. అయితే, అస్వస్థతకు గురైన వారిని మాత్రం నౌకలోనే ప్రత్యేక ఐసొలేషన్ వార్డులలో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. నౌక మొత్తం శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు సంస్థ తెలిపింది. విహార యాత్రలకు వెళ్లే వారు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇటువంటి సందర్భాల్లో భయాందోళన చెందకుండా అధికారుల సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: నైజీరియాలో ఆగని రక్తపాతం.. మార్కెట్పై వైమానిక దాడులు.. 100 మంది బలి!