North Korea Tensions: ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ పై ఇజ్రాయిల్, యూఎస్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలపై క్షిపణులు కురిపిస్తుంది. అయితే ప్రపంచానికి మరో మూల యుద్ధ మేఘాలు అలముకున్నాయి. అమెరికా- సౌత్ కొరియా వార్షిక సైనిక విన్యాసాల వేళ ఉత్తర కొరియా నియంత కిమ్ జంగ్ ఉన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. నార్త్ కొరియా వరుసగా క్షిపణి ప్రయోగాలు చేపడుతూ బలప్రదర్శనకు దిగింది. శనివారం ఏకంగా 10 క్షిపణులను జపాన్ సముద్రంలోకి ఒకేసారి ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ ప్రకటించింది.
ఉత్తరకొరియా క్యాపిటల్ ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. మరోవైపు తాజా పరిణామాలపై జపాన్ రక్షణ శాఖ స్పందించింది. నార్త్ కొరియా ప్రయోగించిన క్షిపణులు తమ దేశ ఎక్సుక్లూజివ్ ఎకానమిక్ జోన్ బయట సముద్ర జలాల్లో పడినట్లు తెలిపింది. ఇటీవల దక్షిణ కొరియాలో ఉన్న తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను అమెరికా పశ్చిమ ఆసియాకు తరలించింది. ఇదే అదనుగా ఉత్తర కొరియా రెచ్చిపోయింది.
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపట్టిన ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు.. ఉత్తర కొరియా నియంత కిమ్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. 11 రోజుల పాటు సాగే ఈ సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా తనపై యుద్ధానికి సన్నాహాలుగా భావిస్తోంది. ఈ క్రమంలో కిమ్ జంగ్ ఉన్ సోదరి కిమ్ యో-జంగ్ ఘాటుగా స్పందించారు. ప్రపంచ దేశాలు ఊహించని రీతిలో భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటాయని హెచ్చరించింది. కిమ్ జంగ్ ఉన్ స్వయంగా క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడం, అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని తన సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.
Also Read: కిమ్ను టార్గెట్ చేసిన ట్రంప్.. అణు యుద్ధం తప్పదా?
నార్త్ కొరియా బాలిస్టిక్ మిసైల్స్ తో పాటు, క్రూయిజ్ మిసైల్స్ను కూడా పరీక్షిస్తుంది. ఇటీవల చో హ్యోన్ డిస్ట్రాయర్ నౌక నుంచి ఈ క్షిపణులను ప్రయోగించింది. గత జనవరిలో కొత్త రకం మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ను నార్త్ కొరియా పరీక్షించింది. తాజాగా జపాన్ సముద్రంలోకి క్షిపణులు ప్రయోగించి కిమ్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజా పరిణామాలు ఆసియాలోనూ యుద్ధ సంకేతాలను బలపరుస్తున్నాయి. నార్త్ కొరియా యుద్ధంలోకి దిగితే ఇది ప్రపంచ మనుగడకే పెను సంక్షోభంగా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.