Pakistan Smart Lockdown: మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యల్లో స్మార్ట్ లాక్ డౌన్ విధించింది. ఏప్రిల్ 7 నుండి దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదేశించినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
పెట్రోలియం ఉత్పత్తులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్, ఖైబర్ పఖ్తుంక్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రోజువారీ వస్తువుల దుకాణాలు రాత్రి 8 గంటలకే మూతపడతాయి. అయితే, ఖైబర్ పఖ్తుంక్వాలోని డివిజనల్ హెడ్ క్వార్టర్లలో మాత్రం రాత్రి 9 గంటల వరకు మినహాయింపు ఇచ్చారు.
వ్యాపార సముదాయాలతో పాటు వినోద.. ఆహార రంగాలపై కూడా ఆంక్షలు విధించారు. బేకరీలు, రెస్టారెంట్లు, తందూర్లు.. వివాహ వేడుకలు రాత్రి 10 గంటలకల్లా ముగించాలి. ప్రైవేట్ నివాసాల్లో జరిగే వివాహ వేడుకలకు కూడా ఇదే సమయం వర్తిస్తుంది. అత్యవసర సేవలు అందించే మెడికల్ స్టోర్లు.. ఫార్మసీలకు ఈ ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం, గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతినడం పాకిస్థాన్పై తీవ్ర ప్రభావం చూపింది. మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 55 పెంచిన ప్రభుత్వం, ఏప్రిల్ 2 నాటికి పెట్రోల్ ధరను రూ. 458.41కి, డీజిల్ ధరను రూ. 520.35కి చేర్చింది. ప్రజాగ్రహం నేపథ్యంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ పెట్రోలియం లెవీని తగ్గించి, ఒక నెల పాటు పెట్రోల్ ధరను రూ. 378కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం మరిన్ని అంతర్గత పొదుపు చర్యలను కూడా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా వారానికి నాలుగు రోజుల పనిదినాలు, ఇంధన భత్యాల్లో తగ్గింపు, ప్రభుత్వ శాఖల వ్యయాల్లో 20 శాతం కోత విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Read Also: ఇరాన్ రైల్వేలను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పౌరులకు ఐడీఎఫ్ హెచ్చరిక !