PoK Map Issue: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిన సందర్భంగా… అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్ మ్యాప్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ మ్యాప్ లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), చైనా ఆధీనంలోని అక్సాయ్ చిన్తో సహా మొత్తం కశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో ఉన్నట్లు చూపించారు. పీంకేను ఇండియా మ్యాప్ లో చూపించడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని అమెరికా అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆ పోస్టును తొలగించేలా చేశామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇస్లామాబాద్ అధికారికంగా మ్యాప్ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి తీసుకెళ్లామని పేర్కొంది. ఆ మ్యాప్ చట్టవిరుద్ధమని తెలిపింది. జమ్ము, కశ్మీర్ మొత్తం భూభాగాన్ని.. భారత్ లో ఉన్నట్లు చూపించడం సరికాదని పాకిస్తాన్ భావిస్తుందని పేర్కొంది. మ్యాప్ ఉన్న పోస్ట్ను తొలగించడం అమెరికా వైపు దిద్దుబాటు చర్యగా భావిస్తున్నామని పాక్ తెలిపింది. ఈ వివాదంపై అమెరికా అధికారులు బహిరంగంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
ఈ వివాదాస్పద ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించే అమెరికా ప్రభుత్వ వైఖరికి ఇది భిన్నంగా ఉంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కశ్మీర్పై అమెరికా విధానంలో మార్పు వచ్చిందా? లేదా పొరపాటున జరిగిందా? అనే దానిపై ఊహాగానాలు చెలరేగాయి. అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా యూఎస్టీఆర్ సైలెంట్గా ఆ పోస్ట్ను తొలగించింది. పీవోకే, అక్సాయ్ చిన్ సహా పూర్తి జమ్ము కశ్మీర్, లడఖ్ తమ అంతర్భాగమని భారత్ స్పష్టం చేస్తుంది. ఈ పోస్ట్ తొలగింపుపై యూఎస్టీఆర్ కార్యాలయం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.