Sheikh Hasina: బంగ్లాదేశ్లో రాజకీయాలు మళ్లీ ఊపందుకోనున్నాయా? ఆ దేశంలో ఏం జరుగుతోంది? త్వరలో బంగ్లాదేశ్కు వెళ్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా ఎందుకన్నారు? అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవా? బీఎన్పీ పాలనలో చీకటి రోజులు నడుస్తున్నాయా? అవుననే అంటున్నారు మాజీ ప్రధాని.
మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. తాను బంగ్లాదేశ్లో లేనంత మాత్రాన సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దన్నారు. దేశం కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. త్వరలో మళ్లీ సొంత దేశానికి తిరిగి వెళ్తానని మనసులోని మాట బయటపెట్టారు.
భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి తిరిగి వెళ్లే సమయం ఇప్పుడు వెల్లడించలేనన్నారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన పునరుద్ధరించబడటమే తన లక్ష్యమని కుండబద్దలు కొట్టేశారు. ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విషయాలు పంచుకున్నారు.
బంగ్లాకు నేను వస్తున్నాను, చీకటి పాలన నడుస్తోంది-హసీనా
అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడాన్ని హసీనా తప్పుబట్టారు. అవామీ లీగ్ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని, దానిని క్లోజ్ చేయడం ఎవరి తరం కాదన్నారు. అదే జరిగితే బంగ్లాదేశ్ పుట్టేది కాదన్నారు. 19 సార్లు తనపై హత్యయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. తాను ఏ రోజూ భయపడలేదని, లక్షలాది మంది మద్దతుదారులు ఉన్నారని ఈ సందర్భంగా వివరించారు.
ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్న హసీనా.. బంగ్లాదేశ్ తాత్కాలిక నేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనుస్పై విరుచుకుపడ్డారు. అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలను టార్గెట్గా చేసుకుని రాజకీయ నరమేధం సృష్టించిందని దుయ్యబట్టారు. తమ పార్టీకి చెందిన దాదాపు 600 మందిని హత్య చేశారని, తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో బంధించారన్నారు. దేశంలో సాధారణ పరిస్థితులు రాగానే నేతలంతా తిరిగి వస్తారని వెల్లడించారు.
ALSO READ: మెక్సికోలో కాల్పుల కలకలం.. స్పాట్లో 10 మంది మృతి, ఎలా జరిగింది?
అదే సమయంలో భారత్ తో ఉన్న సంబంధాల గురించి మాట్లాడారు. ఇరుదేశాల బంధం చారిత్రకమైనదిగా వర్ణించారు. భారత్ మా పొరుగు దేశం కాదని, 1971 స్వాతంత్య్ర పోరాటంలో అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. బంగ్లాదేశ్లోని కొన్ని గ్రూపులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.