Trump: ఇరాన్-అమెరికా మధ్య ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత శాంతి చర్చలు ఆగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 22 అంటే బుధవారం రాత్రితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. దీన్ని మరికొంతకాలం పొడిగిస్తూ ప్రకటన చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు
ఇరాన్ నుండి స్పష్టమైన ప్రతిపాదన వచ్చేవరకు ఈ పొడిగింపు అమల్లో ఉంటుందన్నారు ట్రంప్. ఇరాన్పై ఎలాంటి దాడులు చేయబోమన్నారు. నిజానికి ఈ గడువు పొడిగించే ప్రసక్తే లేదని రెండురోజుల కిందట ట్రంప్ తేల్చిచెప్పారు. పాకిస్తాన్ ప్రధాని, ఆ దేశ ఆర్మీ చీఫ్ చేసిన మధ్యవర్తిత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు.
అదే సమయంలో ఇరాన్ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ ఇరాన్పై సముద్ర వాణిజ్యపరమైన ఆంక్షలను సడలించలేదు అమెరికా. సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి దగ్గర విధించిన సైనిక దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించానని రాసుకొచ్చారు.
పోర్టుల దిగ్బంధం తప్పదని వ్యాఖ్య.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం
ఇరాన్ పాలకవర్గంలో విభజనలు ఉన్నాయని విమర్మలు చేశారు. పొరుగు దేశాల అభ్యర్థనను గౌరవిస్తూ కాల్పుల ఒప్పందం కొద్దిరోజులు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం అంతర్గతంగా చీలిపోయిందని, పాలకులకు-కొన్ని విభాగాలకు మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం లేదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ నాయకులు తప్పుబట్టారు.
ఓడిపోతున్న దేశం తమకు షరతులు విధించలేదని తెలిపింది. ట్రంప్ గడువు పొడిగింపుకు ఎలాంటి విలువ లేదని తేల్చేసింది ఇరాన్. మరోవైపు మంగళవారం ఇరాన్-అమెరికా మధ్య జరగాల్సిన శాంతి చర్చలు జరుగుతాయా లేదా అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చలపై భారీ ప్రతిష్టంభన నెలకొంది.
ALSO READ: ఇస్లామాబాద్ చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ మామకు ఇరాన్ ఊహించని షాక్.. రాయబేరాలు మొదలుపెట్టిన అమెరికా
పాకిస్థాన్ పర్యటనను వాయిదా వేసుకుంది జేడీ వాన్స్ టీమ్. ఇరాన్-అమెరికా మధ్య ఈనెల 11 నుంచి రెండురోజులపాటు ఇస్లామాబాద్లో జరిగిన మొదటి రౌండ్ చర్చలు జరిగాయి. అయితే రెండు లేదా మూడు అంశాలపై చర్చలు విఫలమయ్యాయి. రెండో విడత చర్చలకు ఇరాన్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో పశ్చిమాసియాలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది.