అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, చైనా దేశాలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం.. వలస విధానాలపై విమర్శలు చేస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ రాసిన ఒక లేఖను ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా రీపోస్ట్ చేశారు. ఆ లేఖలో భారత్, చైనాతో సహా పలు దేశాలను భూమిపై ఉన్న నరకాలు అనడం తీవ్ర దుమారం రేపింది.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆచితూచి స్పందించింది. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అంశంపై నేరుగా విమర్శలు చేయకుండా వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు. “మేము కొన్ని నివేదికలను చూశాము.. ప్రస్తుతానికి ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తున్నాం.” అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్ను నరకంతో పోల్చడాన్ని తప్పుబడుతూ హైదరాబాద్లోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఒక కీలక పోస్ట్ పెట్టింది. భారత్ అంటే కేవలం ఒక దేశం కాదని, అది “నాగరికత (Civilisation)కు పుట్టినిల్లు.” అంటూ ఇరాన్ ప్రశంసించింది. ప్రపంచ చరిత్రలో, సంస్కృతిలో భారత్ పోషిస్తున్న పాత్రను గుర్తు చేస్తూ, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని పరోక్షంగా ఎండగట్టింది.
ట్రంప్ గతంలో కూడా వలసదారుల గురించి ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల వేళ అమెరికన్ల పౌరసత్వ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఇతర దేశాలను తక్కువ చేసి చూపడం ఆయన శైలిగా కనిపిస్తోంది. కానీ, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న భారత్, చైనాలను నరకాలు అని పిలవడం పట్ల అటు రాజకీయ వర్గాల నుండి, ఇటు సామాన్య ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
Read Also: ట్రంప్ నోటిదూల.. ఎందుకింత అహంకారం.. భారత్ ఓ నరకమంటూ సంచలన పోస్ట్