US-India Tariffs: అమెరికా మరొక టారిఫ్ బాంబు పేల్చేందుకు సిద్ధమవుతోంది. వెట్టిచాకిరీ నిర్మూలనలో విఫలమైనందున కొన్ని దేశాలపై అదనపు సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈ మేరకు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఓ ప్రతిపాదన చేసింది. భారత్తోపాటు 60 దేశాలపై సుంకాలు విధించాలనే ప్రతిపాదనలు చేసింది.
మరో బాంబ్ పేల్చిన అమెరికా
ఎక్కువ దేశాలపై 12.5శాతం, మిగతా వాటిపై 10 శాతం సుంకం విధించాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బలవంతపు కార్మిక విధానం నిరోధానికి వివిధ దేశాలు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యాయని అమెరికా భావిస్తోంది.
ఈ విషయంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలు అరికట్టలేకపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమస్య కారణంగా అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో అమెరికా కార్మికులకు తీవ్ర పోటీ ఎదురవుతోందని, అసమానతలను తాము సహించలేమని అందులో ప్రస్తావించింది.
భారత్పై అదనపు సుంకాలకు అమెరికా ప్రతిపాదన
మొత్తం 60 దేశాలను టార్గెట్ చేసింది అమెరికా. వాటిపై యూఎస్టీఆర్ దర్యాప్తు జరిపిందని, 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలను ప్రతిపాదించింది. అందులో భారత్తోపాటు చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
కెనడా, ఈక్వెడార్, ఈయూ, ఇండోనేసియా, మెక్సికో, పాకిస్థాన్ దేశాలు నిషేధం విధించినప్పటికీ.. వాటిని సమర్థవంతంగా అమలు చేయలేకపోయాయని ప్రస్తావించింది. ఆయా దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధించాలన్నది అందులోని ప్రధాన ప్రతిపాదన. వీటిపై చర్చించేందుకు ఆయా దేశాలు జూన్ 22లోగా తమను సంప్రదించవచ్చని సూచన చేసింది.
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను విధించాలన్నది యూఎస్టిఆర్ ప్రధాన ప్రతిపాదన. కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావని, ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు జరగనున్నాయి.
ఒకవేళ కొత్త సుంకాలు అమల్లోకి వస్తే, ఆదేశ సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి ఈ చర్య వీలు కల్పించనుంది. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అమెరికా-భారతదేశానికి చెందిన వాణిజ్య అధికారులు న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.