Donald Trump: ఇరాన్తో సంబంధాలు కలిగి ఉండి, ఆ దేశానికి ఆయుధాలను సరఫరా చేసే దేశాలపై 50 శాతం భారీ టారిఫ్లను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా బుధవారం సాయంత్రం ఈ హెచ్చరికను జారీ చేశారు.
అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఇరాన్కు ఆయుధ సహకారం అందిస్తూనే, మరోవైపు అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశాలపై ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. “ఇరాన్కు ఆయుధాలిచ్చే దేశంపై 50 శాతం టారిఫ్లు ఉంటాయి. ఇందులో ఎవరికీ, ఎటువంటి మినహాయింపులు ఉండబోవు.” అని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ మార్పులను ఆయన స్వాగతిస్తూనే, ఆ దేశ అణు కార్యక్రమాలను పూర్తిగా అణిచివేస్తామని పునరుద్ఘాటించారు.
ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ (Space Force) నిరంతరం ఉపగ్రహ నిఘా ఉంచుతోందని ట్రంప్ వెల్లడించారు. భూగర్భంలో దాచిన యురేనియం, అణు సంబంధిత ‘డస్ట్’ (Nuclear Dust) ను వెలికితీసి తొలగించేందుకు అమెరికా, ఇరాన్ సంయుక్తంగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. దాడులు జరిగిన నాటి నుండి ఇప్పటివరకు అక్కడ ఏదీ కదలలేదని శాటిలైట్ డేటా స్పష్టం చేస్తోందన్నారు. ఇరాన్పై ఉన్న ఆంక్షల సడలింపు, టారిఫ్ల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయని, తాము ప్రతిపాదించిన 15 పాయింట్లలో ఇప్పటికే చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా ఇరాన్కు రక్షణ పరంగా సహకరిస్తున్న కొన్ని ఆసియా, యూరోపియన్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయుధ సరఫరాను ఆపకపోతే అమెరికా మార్కెట్ను కోల్పోవాల్సి వస్తుందని లేదా భారీ పన్నులు చెల్లించాల్సి వస్తుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ప్రపంచ దేశాలు అమెరికాతో వ్యాపారం చేయాలా లేక ఇరాన్కు ఆయుధాలు ఇవ్వాలా అనే నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలని ఈ పోస్ట్ ద్వారా ట్రంప్ హెచ్చరించారు.
Read Also: యూఎస్, ఇరాన్ సీజ్ ఫైర్ కు పాక్ మధ్యవర్తిత్వం.. ఇస్లామాబాద్ తాపత్రయానికి కారణాలివే!