Iran vs America: ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఏం జరగబోతోంది? హోర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం దేనికి సంకేతం? ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతుందా? లేకుంటే మరో విడత చర్చలు జరుగుతాయా? ఈసారి జెనీవా వేదికగా రెండోసారి చర్చలు చేపట్టాలని ఇరుదేశాలు కసరత్తు చేస్తున్నాయా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు!
యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా-ఇరాన్ సిద్ధమవుతున్నాయి. మరోసారి చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈనెల 21తో రెండువారాల కాల్పుల విరమణ గడువు ముగియనుంది. ఈలోపు ఓ ఒప్పందానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు బలంగా వున్నాయి.
తొలివిడత ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. అన్ని అంశాలు ఓకే అయినప్పటికీ కేవలం అణు కార్యక్రమం, హోర్మూజ్ జలసంధి విషయాలపై చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు మళ్లీ భేటీ అయ్యేందుకు సుముఖంగా ఉన్నాయంటూ అందులోని సారాంశం.
టర్కీ ఆధ్వర్యంలో ఈసారి జెనీవా వేదికగా.. వీలైతే ఈ వారంలో భేటీ!
టెహ్రాన్తో కొత్తగా ముఖాముఖి చర్చలకు వాషింగ్టన్ మార్గం తెరిచి ఉంచిందని సీఎన్ఎస్, అసోసియేట్ ప్రెస్ పేర్కొన్నాయి. ఈ వారం ప్రత్యక్ష చర్చలు జరపడంపై ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయని మధ్యవర్తిత్వ దేశానికి చెందిన ఓ రాయబారి చెప్పినట్లు అసోసియేట్ ప్రెస్ పేర్కొంది. ఈ చర్చలు ఇస్లామాబాద్ లేకుంటే జెనీవాలో జరిగే అవకాశం ఉందని వార్తలు లేకపోలేదు.
వేదిక, సమయం ఇంకా ఖరారు కాలేదు. గురువారం నాటికి భేటీ ఉండొచ్చని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అమెరికా అధికారులు మరో విడత ఇరాన్తో ముఖాముఖి చర్చలు నిర్వహించాలనే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు సీఎన్ఎన్ ప్రస్తావించింది. ఈ చర్చలు ఇంకా ఖరారు కాలేదని, అధికారులు తేదీ, లొకేషన్ సమీక్షిస్తున్నారని వెల్లడించింది. ఈసారి టర్కీ కీలక పాత్ర పోషించవచ్చని తెలుస్తోంది.
ALSO READ: హర్మూజ్ గుండా భారత్ నౌకలకు అనుమతి.. ఇరాన్ రాయబారి కీలక ప్రకటన
సోమవారం అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తమను సంప్రదించిందని వ్యాఖ్యానించడం ఈ వార్తలకు బలం చేకూరుతోంది. టెహ్రాన్ తమ డిమాండ్లకు తలొగ్గితే చర్చలు పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇస్లామాబాద్ శాంతి చర్చల తర్వాత ఇరాన్ ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు ఒకసారి జరగవని, కాకపోతే ముందు అడుగు పడిందన్నారు. పలు దఫాలుగా చర్చలు జరుగుతాయన్నారు. ఇస్లామాబాద్ చర్చల తర్వాత ఇరాన్ ఈ విషయాన్ని ప్రధానంగా చెప్పుకొచ్చింది. చర్చల పురోగతిని బట్టి కాల్పుల విరమణ గడువును ఇరుపక్షాలు పొడిగించే అవకాశం ఉంది.