Delhi Alert: న్యూఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రేపు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘చలో పార్లమెంట్’ ముట్టడి పిలుపుతో దేశ రాజధానిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు ఢిల్లీ పోలీసులు సర్వసన్నద్ధమయ్యారు.
కేంద్ర మంత్రి నివాసం వద్ద ముట్టడి
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీజేపీ మద్దతుదారులు మంత్రి నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన రహదారులను బారికేడ్లతో మూసివేసి, రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు.
నగరంలో 144 సెక్షన్ అమలు
పరిస్థితి చేజారకుండా ఉండేందుకు రేపు న్యూఢిల్లీ పరిధిలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఢిల్లీ డీసీపీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం నగరంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట గుమికూడటంపై పూర్తి నిషేధం విధించారు. ప్రజా భద్రతతో పాటు ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ర్యాలీకి అనుమతి లేదు.. పోలీసుల హెచ్చరిక
జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు నిర్వహించ తలపెట్టిన ఈ ర్యాలీకి సంబంధించి నిర్వాహకులు ఎవరూ తమను ముందస్తు అనుమతి కోరలేదని పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ నిరసన ప్రదర్శనకు ఎలాంటి అనుమతి లేదని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా జరిగే ఈ ర్యాలీలలో ప్రజలెవరూ పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా పోలీసుల హెచ్చరికలను ఉల్లంఘించి వీధుల్లోకి వస్తే.. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రశాంత వాతావరణానికి ప్రజలంతా సహకరించాలని ఢిల్లీ పోలీసులు కోరారు.
Also Read: కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్షీట్లో సంచలన నిజాలు!