Iran Ship IRIS Dena: పశ్చిమ ఆసియా యుద్ధ జ్వాలలు సముద్ర గర్భంలో భీకర రూపం దాల్చాయి. హిందూ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఇరాన్ యుద్ధనౌక ఐఆర్ఐఎస్ డేనపై తామే చేశామని అమెరికా అధికారికంగా ప్రకటించింది. తమ దేశానికి చెందిన ఒక అజ్ఞాత జలాంతర్గామి (Submarine) టార్పిడోలను ప్రయోగించి ఇరాన్ నౌకను ధ్వంసం చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు.
ఈ దాడి అత్యంత భీకరంగా జరగడంతో నౌకలో ఉన్న మొత్తం 180 మంది నావికుల్లో 101 మంది మరణించినట్లు సమాచారం. మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోవడంతో మృతదేహాల కోసం.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రమాద సమయంలో నౌక నుంచి అందిన SOS సిగ్నల్స్ ఆధారంగా శ్రీలంక నావికాదళం వెంటనే రంగంలోకి దిగింది. 30 మందిని ప్రాణాలతో కాపాడి సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా.. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది.ప్రధానంగా ఈ ఇరాన్ యుద్ధనౌక ఇటీవల భారతదేశంలోని విశాఖపట్నం (వైజాగ్) లో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.
ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం తన నావికుల మృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా ప్రకటన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని తన ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్.. అక్కడ ఉన్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో హిందూ మహాసముద్రంలో జరిగిన ఈ దాడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ముఖ్యంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
Read Also: Iran – Israel War: సౌదీపై ఇరాన్ దాడి.. అడ్డంగా బుక్కైన పాక్.. యుద్ధంలోకి దిగక తప్పదా?