Iran – Israel War: ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి దయాది దేశం పాకిస్థాన్ కూడా అడుగుపెట్టే అవకాశముందని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. తాజాగా సౌదీ అరేబియాపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి దీనికి ప్రధాన కారణం కాబోతుందన్న చర్చ జరుగుతోంది. గతేడాది సెప్టెంబర్ లో సౌదీ అరేబియాతో పాకిస్థాన్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం సౌదీ లేదా పాక్ పై ఏ దేశమైన దాడి చేస్తే దానిని తమపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అత్మాహుతి డ్రోన్.. సౌదీని తాకిన నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ కూడా యుద్ధరంగంలోకి దిగాల్సిన పరిస్థితులు తలెత్తినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు పేర్కొంటున్నాయి.
సౌదీ అరేబియాపై జరిగిన దాడి నేపథ్యంలో పాక్ ఇచ్చే సమాధానం.. ఆ రెండు దేశాల భవిష్యత్ సంబంధాలు నిర్ణయించవచ్చన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సౌదీతో పాక్ చేసుకున్న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం (Strategic Mutual Defence Agreement -SMDA) ప్రకారం రెండు దేశాలు ఉమ్మడిగా ఇరాన్ పై యుద్ధ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. పాక్ అణ్వాయుధ దేశం కావడంతోనే సౌదీ ఈ మేరకు రక్షణ ఒప్పందం కుదుర్చుకుందన్న ప్రచారం గతంలో పెద్ద ఎత్తున జరిగింది.
అయితే సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్పందించారు. తాము యుద్ధంలో భాగం కాకూడదని భావిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్, సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీన్ని బట్టి సౌదీపై దాడి జరిగినా.. తాము చేసుకున్న ఒప్పందానికి తామే విలువ ఇవ్వమని పాక్ విదేశాంగ మంత్రి పరోక్షంగా చెప్పినట్లైందని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ SMDA ఒప్పందానికి కట్టుబడాలని పాక్ పై సౌదీ ఒత్తిడి చేస్తే.. అప్పుడు దయాది దేశం ఇరాకటంలో పడే అవకాశం ఉంటుందని రక్షణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. అప్పుడు పాక్ సైతం యుద్ధంలోకి అడుగుపెడితే.. ఇరాన్ కు టార్గెట్ గా మారే అవకాశముందని చెబుతున్నారు. అదే జరిగితే పాక్ వైపునకు సైతం ఇరాన్ క్షిపణులు దూసుకువెళ్లొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ చేతిలో పాక్ చావు దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సౌదీ కోసం ఇరాన్ తో కయ్యాన్ని కొనితెచ్చుకుంటే ఆర్థికంగా మరింత పతనావస్థకు చేరే ప్రమాదం ఉంటుందని పాక్ ప్రభుత్వాధినేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మెుత్తంగా సౌదీపై జరిగిన ఒక డ్రోన్ దాడి.. పాక్ ను అడ్డంగా బుక్ చేసిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.