Operation Sindoor: గతేడాది మే నెలలో 6-7 వ తేదీన అర్ధరాత్రి వేళ భారత సైన్యం.. పాకిస్థాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసింది. దీనిపై అమెరికా మిలిటరీ నిపుణుడు జాన్ స్పెన్సర్ సంచలన విశ్లేషణ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఈ సైనిక చర్యలో.. కేవలం 72 గంటల వ్యవధిలోనే పాకిస్థాన్పై భారత్ గగనతల ఆధిపత్యాన్ని సాధించిందని ఆయన వెల్లడించారు. ఘర్షణ ప్రారంభంలో భారత్ తన యుద్ధ విమానాలను కోల్పోవడంతో పాక్ పైచేయి సాధించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ.. వాస్తవానికి యుద్ధ క్షేత్రంలో భారత్ అత్యంత వేగంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించి పాక్ను కాల్పుల విరమణకు బలవంతం చేసిందని స్పెన్సర్ పేర్కొన్నారు.
మే 7వ తేదీ తెల్లవారుజామున భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో దానికి నిరసనగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. జైషే మహ్మద్.. లష్కరే తోయిబా వంటి నిషేధిత సంస్థలకు చెందిన తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రారంభంలో ఒక రాఫెల్.. ఒక మిరాజ్-2000 యుద్ధ విమానాలను కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత భారత వైమానిక దళం (IAF) అనుసరించిన వ్యూహం పాక్ రక్షణ వ్యవస్థను కుప్పకూల్చింది.
తర్వాతి రెండు రోజుల్లో ఇజ్రాయెల్ తయారీ హరోప్.. హార్పీ వంటి డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ రాడార్ వ్యవస్థలను.. హెచ్క్యూ-9 వైమానిక రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. దీంతో శత్రువుల దాడులను పసిగట్టే సామర్థ్యాన్ని పాక్ కోల్పోయింది. అలాగే సరిహద్దుల్లో మోహరించిన ఎస్-400 (S-400) రక్షణ వ్యవస్థ పాక్ యుద్ధ విమానాలు గగనతలంలో స్వేచ్ఛగా తిరగకుండా అడ్డుకుంది. ఈ పోరులో పాక్కు చెందిన పలు ఎఫ్-16.. జెఎఫ్-17 విమానాలు నేలకూలాయని స్పెన్సర్ తన నివేదికలో వెల్లడించారు. భారత సైన్యం ప్రదర్శించిన ఈ సమగ్ర యుద్ధ తంత్రం పాక్ సైన్యాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది.
యుద్ధం చివరి దశలో మే 10వ తేదీన భారత్ అత్యంత శక్తివంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులతో పాక్ లోని నూర్ ఖాన్.. మురీద్.. సర్గోధ.. జాకోబాబాద్ వంటి ప్రధాన వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. డ్రోన్ కేంద్రాలు.. కమాండ్ సెంటర్లే లక్ష్యంగా సాగిన ఈ దాడులతో పాక్ పూర్తిగా బలహీనపడింది. మే 10వ తేదీ మధ్యాహ్నం కల్లా పాక్ అధికారులు స్వయంగా కాల్పుల విరమణను కోరారని.. ఇది కేవలం దౌత్యపరమైన ఒత్తిడి వల్ల కాకుండా యుద్ధ క్షేత్రంలో భారత్ సృష్టించిన విధ్వంసం వల్లే జరిగిందని స్పెన్సర్ విశ్లేషించారు. భారత సైనిక సామర్థ్యం ప్రపంచస్థాయికి చేరిందని చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు.
Read Also: తెలంగాణలో డ్రగ్స్ కట్టడి చేయడమే.. మా ఫస్ట్ ప్రయారిటీ: డీజీపీ సీవీ ఆనంద్