తెలంగాణ ఉన్నత న్యాయస్థానం (TGHC) నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ లో ఆఫీస్ సబార్డినేట్ తో పాటు డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయం రేపటితో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించడానికి ఫిబ్రవరి 28ని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ గడువు ముగియడానికి కేవలం కొన్ని గంటలే సమయం ఉండటంతో అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వెకెన్సీ వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 34 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. మిగిలిన 9 పోస్టులను డ్రైవర్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో అత్యంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ సాగనుంది.
పోస్టులను బట్టి విద్యా అర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు కనీసం 7వ తరగతి లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు విషయంలో ప్రభుత్వం భారీ సడలింపులు ఇచ్చింది. 2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 46 ఏళ్లు మించకూడదు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ అభ్యర్థఉలకు 5 ఏళ్ల మినహాయింపు ఇచ్చారు. దివ్యాంగులకు (PH) 10 ఏళ్ల వరకు వయో సడలింపు వర్తిస్తుంది. దీని వల్ల గరిష్ఠ వయస్సు ఉన్న వారు కూడా పోటీ పడే అవకాశం కలిగింది.
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు లభిస్తాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు నెలకు రూ.19,000 నుండి రూ.58,850 వరకు వేతనం ఉంటుంది. డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.22,900 నుండి రూ.69,150 వరకు నెలవారీ జీతం అందుతుంది. అదనంగా ఇతర జీతభత్యాలు కూడా ఉంటాయి.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ.500 గా ఉంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు జనరల్.. బీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ.. ఎస్టీ.. ఈడబ్ల్యూఎస్.. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. డ్రైవర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ అదనంగా ఉంటుంది. టాలెంట్ ఆధారంగానే తుది ఎంపిక జాబితా రూపొందిస్తారు.
ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ రేపటితో ముగియనుంది. సాంకేతిక ఇబ్బందులు రాకముందే అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుకు చివరి తేది: 2026 ఫిబ్రవరి 28
ALSO READ: Telangana: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం.. 745 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల