Hyderabad Crime News: హైదరాబాద్ వనస్థలిపురంలో పట్టపగలే అత్యంత కిరాతకమైన హత్య ఒకటి చోటు చేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లో సునీత అనే మహిళను ఆమె మొదటి భర్త మహేష్ దారుణంగా నరికి చంపాడు. విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుని సంతోషంగా ఉంటుందనే కక్షతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో సునీత నివాసం ఉంటున్న ఫ్లాట్లోకి మహేష్ చొరబడ్డాడు.
నిందితుడు వెంట తెచ్చుకున్న రెండు కత్తులు పెట్రోల్ డబ్బాతో బాధితురాలిని బెడ్ రూమ్లో బంధించి విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో ఆమె తలపై బలంగా బాదడంతో కీలక భాగాలు బయటకు వచ్చి సునీత అక్కడికక్కడే మరణించింది. లోపల జరుగుతున్న దారుణాన్ని గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులను నిందితుడు పెట్రోల్ పోసి నిప్పట్టిస్తానంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు లోపలికి వెళ్లలేక బయటే నిలిచిపోయారు.
హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతడిని ధైర్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ స్వయంగా అపార్ట్మెంట్ను సందర్శించి వివరాలు ఆరా తీశారు. విడాకులు పొందిన ఏడాది తర్వాత సునీత రెండో వివాహం చేసుకుని ఉంటుండగా మహేష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రస్తుతం నిందితుడు మహేష్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సునీత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ బాధిత బంధువుల నుంచి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రీన్ సిటీ కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టపగలు ఇంట్లోకి చొరబడి జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి.. గమ్యస్థానానికి చేరకముందే అనంత లోకాలకు!