Bandi Sanjay: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ మావోయిస్టులకు, అర్బన్ నక్సలైట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిడ్మా, ఆయన భార్య ఎన్కౌంటర్లో మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. మావోయిస్టులకు లొంగిపోవడానికి మరో నాలుగు నెలలే సమయం ఉందని.. లేకుంటే ఏది జరగాలో అదే జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్లను నమ్ముకుంటే ఏమీ సాధించలేరని.. బ్యాలెట్ను నమ్ముకోవాలని ఆయన మావోయిస్టులకు హితవు పలికారు.
వేములవాడలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మరణించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘ఇన్నాళ్లూ తుపాకీ చేతబట్టిన హిడ్మా ఏం సాధించారు?’ అని ఆయన ప్రశ్నించారు. ‘తుపాకీ చేతపట్టుకొని చర్చలు కావాలంటే కుదరదు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులంతా క్షేమంగా ఉన్నారు. బుల్లెట్లను నమ్ముకొని ఏం సాధించలేరు. బ్యాలెట్ను నమ్ముకోండి’ అని మావోయిస్టులకు ఆయన సూచించారు.
అదే విధంగా.. యువతను తప్పుదోవ పట్టిస్తున్న అర్బన్ నక్సలైట్ల తీరుపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్బన్ నక్సలైట్ల మాట విని యువత చెడిపోవద్దని ఆయన హితవు పలికారు. వాళ్లంతా ఏసీ గదుల్లో ఉండి పైరవీలు చేసుకుంటున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సరైన మార్గంలో నడవాలని, హింసను ప్రేరేపించే వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. మావోయిస్టులకు, వారి మద్దతుదారులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తాయనే సంకేతాలను బండి సంజయ్ వ్యాఖ్యలు బలంగా తెలియజేస్తున్నాయి.
మావోయిస్టులకు లొంగిపోవడానికి తుది గడువును విధించడం ద్వారా.. భద్రతా దళాలు మావోయిస్టుల ఏరివేతకు మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ హెచ్చరిక మావోయిస్టుల ఏరివేత విషయంలో ప్రభుత్వ వైఖరి ఎంత కఠినంగా ఉందో తెలియజేస్తుంది.
ALSO READ: RRB Group-D: 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ వాయిదా, కొత్త షెడ్యూల్ ఇదే