Bhatti Vikramarka: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ హక్కుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. ఆయా వర్గాల హక్కులను కాపాడడం కోసం సంఘాలను నడిపిస్తున్న అందరికీ హృదయ పూర్వకంగా అభినందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
Also Read:
భవిష్యత్ లో సంఘాలకు, ఉద్యోగస్తులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ప్రజా ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులు, సంఘాల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అదే ప్రజా ప్రభుత్వంలో సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నట్లు భట్టి పేర్కొన్నారు.
ఉద్యోగులు, సంఘాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ తమ అభిప్రాయాలను రుద్దలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, అసొసియేన్ ఫౌండర్, సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్, వర్కింగ్ సెక్రెటరీ పీఎం రాజు, జెన్ కో, ట్రాన్స్ కో, ఎన్ పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.