Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించిన కమలనాథులకు క్షేత్రస్థాయి ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి అన్న చందంగా పార్టీ పరిస్థితి తయారైంది. భారీ అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోవడంతో పార్టీ కేడర్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే.. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా స్వయంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ కు ప్రచారం నిర్వహించారు. ఆయన నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాక నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభ కూడా ఇదే అన్నట్లుగా తెలుస్తోంది. అలాంటి స్థానంలో కూడా కాషాయ పార్టీ మూడోస్థానానికే పరిమితం కావడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికలను కాషాయ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. ఎంపీలను స్థానికంగానే పరిమితం చేసి భారీ స్థాయిలో స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేసింది. అందుకు నితిన్ నబీన్ సిన్హాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను రంగంలోకి దింపింది. ఈ ఎలక్షన్ లో గెలుపును హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నా ప్రచారానికి జాతీయ స్థాయి కీలక నేతలను రంగంలోకి దింపడం మైనస్ గా మారిందని వినికిడి. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఓటర్లను ఆకట్టుకోవడంలో స్థానిక నేతలు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సొంత బలగం ఉన్న చోట కూడా ప్రభావం చూపలేకపోవడం పార్టీ అంతర్గత వైఫల్యాలను ఎత్తిచూపుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా నిరాశాజనక ఫలితాలు వచ్చినా, కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీకి కైవసం చేసుకోవడం కొంత ఊరటనిచ్చింది. పట్టణ ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపడం విశేషం. కేంద్ర మంత్రి బండి సంజయ్ చరిష్మా పనిచేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఆదిలాబాద్ వంటి మున్సిపాలిల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి కైవసం చేసుకుంది. కాషాయ పార్టీకి సానుకూల అంశం ఏమిటంటే, సీట్ల సంఖ్య ఆశించినంతగా లేకపోయినా.. ఓవరాల్గా బీజేపీ ఓటు బ్యాంక్ గతంతో పోలిస్తే పెరిగింది. నిజామాబాద్ వంటి కొన్ని కీలక కార్పొరేషన్లలో బలమైన పోటీని ఇచ్చి రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. నిజామాబాద్ కార్పొరేషన్ ను తృటిలో చేజార్చుకుంది. కాగా ఈసారి ఎన్నికల్లో అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేకపోయినా అనేక చోట్ల రెండో స్థానంలో 5 ఓట్లు, 10 ఓట్ల తేడాతో ఓటమి చవిచూడటం వల్ల ఓటు బ్యాంకు భారీగా పెంచుకోగలిగింది. ఇది పార్టీకి భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది. అయితే, పెరిగిన ఓటు శాతం సీట్లుగా మారకపోవడంతో కేడర్ డీలా పడిపోయింది. మొత్తానికి, మున్సిపల్ యుద్ధంలో కమలం పార్టీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రభావం పనిచేయకపోవడం, సమన్వయ లోపం వెరసి బీజేపీకి ఈ ఫలితాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరంలో మిత్రపక్షాల మధ్య నెలకొన్న సందిగ్ధత చివరకు ఫలితాలపై ప్రభావం చూపినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికల నగారా మోగగానే, పట్టణ ప్రాంతాల్లో జనసేనకున్న క్యాడర్ను, యువతలో ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని బీజేపీ తొలుత పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన మద్దతు కోరింది. ఉమ్మడి కార్యాచరణతో బరిలోకి దిగి అధికార పక్షాన్ని ఎదుర్కోవాలని భావించారు. అయితే పార్టీకి చెందిన ఒక వర్గం నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ బ్యాక్ స్టెప్ వేశారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి పార్టీలో నెలకొంది. జనసేన తమ అభ్యర్థుల తరుపున అయినా ప్రచారం చేద్దామంటే దానికి కూడా చాన్స్ లేకుండా చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా చివరకు జనసేన రెండు మున్సిపల్ వార్డులను కైవసం చేసుకుంది.
Also Read: CM Revanth Reddy: హస్తినలో రేవంత్ రెడ్డి జోరు.. కార్పొరేషన్ ఫలితాలపై ధీమా.. ఢిల్లీ నుంచే వ్యూహరచన!