Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేకెత్తించే విషాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఔటర్ ప్రాంతంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో నిలిపి ఉంచిన ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో ఆగి ఉన్న కారును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల శరీరాలపై ఎలాంటి బయటి గాయాలు లేకపోవడం ఈ కేసులో మిస్టరీని మరింత పెంచుతోంది. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యలా లేక సామూహిక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుండి కీలకమైన శాంపిల్స్ను సేకరించారు. కారులో విషపూరిత వాయువులు ఏవైనా వెలువడ్డాయా లేదా వారు ఏదైనా విషాహారం తీసుకున్నారా అనే అనుమానాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
మృతుల గుర్తింపు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది, వారు ఎక్కడి నుండి వచ్చారు అనే వివరాలను సేకరిస్తున్నారు. పీరాగడి ఫ్లైఓవర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. “కారులో వ్యక్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారనే సమాచారం అందగానే మేము అక్కడికి చేరుకున్నాం. ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించాం. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నాం” అని ఢిల్లీ పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ మిస్టరీ మరణాలు హస్తినలో ఒక్కసారిగా సంచలనంగా మారాయి.
Read Also: పొలాల్లో బోల్తా పడ్డ శిక్షణ విమానం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం