India’s Bullet Train Project: భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. ఈ హైస్పీడ్ రైలు సేవలు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. 2027 ఆగస్టు 15 నుంచి తొలి దశలో బుల్లెట్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా మొదట సూరత్-బిలిమోరా మార్గంలో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ ను ఒకేసారి కాకుండా దశలవారీగా ప్రారంభించనున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిర్మాణం పూర్తయ్యే కొద్దీ మిగిలిన ప్రాంతాలకు కూడా సేవలు విస్తరిస్తారు.
తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన అశ్విని వైష్ణవ్, భారత్ హైస్పీడ్ రైలు యుగంలోకి అడుగుపెడుతోందని అన్నారు. తొలి దశ తర్వాత వాపి, ఆపై అహ్మదాబాద్, తర్వాత థానే వరకు సేవలు విస్తరించి, చివరికి పూర్తి ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బుల్లెట్ రైలు నడుస్తుందని వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తైందని మంత్రి తెలిపారు. నిర్ణయించిన గడువులోనే మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని చెప్పారు. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభమైన తర్వాత ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
అశ్విని వైష్ణవ్ మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్ను ప్రధాన హైస్పీడ్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందుకోసం హైదరాబాద్ను ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానం చేసే మూడు బుల్లెట్ రైలు కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇవి అమల్లోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. పూణే నుంచి హైదరాబాద్కు కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చని మంత్రి తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 50 నిమిషాలు, హైదరాబాద్ నుంచి అమరావతికి 1 గంట 10 నిమిషాలు, చెన్నైకి 3 గంటలు, బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పారు.
India's first Bullet Train enters its next chapter.
Starting next year, the under-construction Mumbai–Amdavad High-Speed Rail corridor will open phase by phase, beginning with the Surat–Bilimora section: Hon'ble MR Shri @AshwiniVaishnaw pic.twitter.com/O6WmIQXOOa— Ministry of Railways (@RailMinIndia) July 11, 2026
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడానికే కాకుండా, కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, పరిశ్రమల వృద్ధికి దోహదపడడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ ప్రాజెక్టులను దేశ అభివృద్ధికి “గేమ్ ఛేంజర్”గా అభివర్ణించారు.
Read Also: టికెట్ లేకున్నా వారిని రైల్లో నుంచి దించకూడదట, ఇండియన్ రైల్వేలో చాలామందికి తెలియని సేఫ్టీ రూల్..