E20 Petrol: ఇంధన ధరల మోత, కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 80% సాధారణ పెట్రోల్, 20% ఇథనాల్ కలిపి తయారుచేసే ఈ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నారు. అయితే, ఈ కొత్త పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందనే ప్రచారం, ఇంజిన్ పాడవుతుందనే భయాలు వాహనదారుల్లో గట్టిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అసలు నిజానిజాలు ఏంటో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
మైలేజీ తగ్గుతుందనేది నిజమేనా?
వాహనదారుల ప్రధాన ఆందోళన మైలేజీ గురించే. దీనిపై కేంద్ర చమురు శాఖ స్పందిస్తూ, E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీ 3 నుండి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని బహిరంగంగానే ఒప్పుకుంది. అయితే, ప్రస్తుతం వాడుతున్న E10 ఇంధనంతో పోలిస్తే ఇది ఎంతో స్వచ్ఛమైనది, నాణ్యమైనదని స్పష్టం చేసింది.
ఇంజిన్ పాడవుతుందా? పికప్ ఎలా ఉంటుంది?
E20 వాడితే ఇంజిన్లు పాడవుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చే ముందే అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు చేశామని తెలిపింది. పైగా, ఈ పెట్రోల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంజిన్ లోపల ‘యాంటీ-నాకింగ్’ (ఇంజిన్ శబ్దం రాకుండా ఉండటం) మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల వాహనం పికప్ పెరగడమే కాకుండా, ప్రయాణం కూడా స్మూత్గా సాగుతుంది.
Also Read: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అపార్ట్మెంట్లు ఈ పని చేయకపోతే ఇక ట్యాంకరే దిక్కు!
పర్యావరణానికి, రైతులకు మేలు
ఈ ఇంధనం వల్ల వ్యక్తిగతంగా కొద్దిగా మైలేజీ తగ్గినప్పటికీ, దేశానికి మరియు పర్యావరణానికి జరిగే మేలు చాలా ఎక్కువ. వాహనాల నుండి వచ్చే ప్రమాదకరమైన కార్బన్ ఉద్గారాలు (పొగ) ఈ పెట్రోల్ వల్ల భారీగా తగ్గుతాయి. అంతేకాకుండా, ఇథనాల్ను చెరుకు, ధాన్యాల నుండి తయారు చేయడం వల్ల దేశీయంగా రైతులకు మంచి డిమాండ్ లభిస్తుంది. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం లాభదాయకమైన ధరలను కూడా నిర్ణయిస్తోంది.
ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతో కీలకం. ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో వాహనదారుల్లో ఉన్న సందేహాలను పూర్తిగా నివృత్తి చేయాలంటే.. పాత వాహనాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇంకాస్త అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
Also Read: విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం.. 7 ప్రైవేట్ బస్సులు దగ్ధం!