E-Paper
Advertisement

Panchayat Elections Live Updates: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. మొదలైన కౌంటింగ్

Panchayat Elections Live Updates: ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.. మొదలైన కౌంటింగ్

‘భోజనం రాలేదు.. ఓట్లు లెక్కించం’..

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మేజర్ గ్రామపంచాయతీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయం దాటినా భోజనం రాకపోవడంతో ఎన్నికల సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. భోజనం పెడితేనే ఓట్లు లెక్కిస్తామని తెగేసి చెప్పి, ప్రక్రియను కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే వారికి భోజన ఏర్పాట్లు చేశారు. సిబ్బంది భోజనం చేసిన అనంతరం కాస్త ఆలస్యంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది.

రాజన్న సిరిసిల్లలో 78.58 శాతం పోలింగ్ నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఐదు మండలాల్లో మొత్తం 1,11,148 ఓట్లు ఉండగా, అందులో 87,339 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో మొత్తం 78.58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కరీంనగర్‌లో 81.42 శాతం నమోదు

కరీంనగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 81.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 91 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,52,408 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,24,088 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జగిత్యాలలో వింత ఘటన.. మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగేసిన ఓటర్

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వెంకట్ అనే ఓటరు, బ్యాలెట్ బాక్స్‌లో వేయాల్సిన పేపర్లను నోటితో నమిలి మింగేశాడు. వార్డు మెంబర్ (వైట్) బ్యాలెట్ పేపర్‌ను పూర్తిగా మింగేయగా, సర్పంచ్ (పింక్) బ్యాలెట్ పేపర్‌ను నమిలి ఊసివేశాడు. దీంతో అవాక్కైన ఎన్నికల అధికారులు వెంటనే అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వెంకట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉమ్మడి వరంగల్‌లో భారీగా పోలింగ్.. మహబూబాబాద్‌లో రికార్డు స్థాయి నమోదు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు అందిన సమాచారం ప్రకారం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 89 శాతం పోలింగ్ నమోదైంది. జయశంకర్ భూపాలపల్లిలో 82.24 శాతం, వరంగల్ జిల్లాలో 81.2 శాతం పోలింగ్ జరిగింది. ఇక ములుగులో 73 శాతం, జనగామలో 71.96 శాతం, హనుమకొండలో 71.3 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

బొమ్మలరామారంలో ‘ఆదర్శ’ పోలింగ్.. ఓటర్లకు మొక్కలతో స్వాగతం

గ్రామపంచాయతీ ఎన్నికల కోసం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పచ్చని మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరిమట్టలు, పూలతో అలంకరణలు, రంగుల ముగ్గులతో పోలింగ్ కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఫకీర్‌గూడెంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. మొదటగా ఓటు వేసిన వారికి పూల మొక్కలతో స్వాగతం పలికారు కలెక్టర్. అనంతరం పోలింగ్ కేంద్రంలో మట్టి కుండలలో మంచి నీటి సదుపాయం, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.

కరీంనగర్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. క్యూలో ఉన్న వారికి అవకాశం

కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. అయితే, గడువు ముగిసే సమయానికి ఇంకా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. నిబంధనల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో లేదా క్యూ లైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో చెదురుమదురు ఘటనలు.. గజ్వేల్‌లో డబ్బుల పంపిణీ కలకలం

ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడత పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామలో ఓ సర్పంచ్ అభ్యర్థి డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో గొడవ జరిగింది. ములుగు మండలం బహిలంపూర్‌లో గుంపులుగా వస్తున్న ఓటర్లను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా నందిగామలో క్యూ లైన్‌లో ప్రచారం చేస్తున్న అభ్యర్థిని పోలీసులు చెదరగొట్టారు. ఇక మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఇరిగేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పోలింగ్ ఏజెంట్‌గా కూర్చోవడంపై అభ్యర్థి శశిధర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఘనపురంలో కాంగ్రెస్ వర్సెస్ రెబెల్.. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మోతపోతుల శివశంకర్ గౌడ్ పై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు కరపత్రాలు పంచడంతో వివాదం రాజుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, అది కాస్తా బాహాబాహీకి దారితీసింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో జిల్లా ఎస్పీ స్వయంగా పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

శంషాబాద్‌లో బ్యాలెట్ పేపర్ చించిన ఓటర్..

శంషాబాద్ మండలం పెద్ద షాపూర్‌లో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ హల్ చల్ చేశాడు. తాను అనుకున్న అభ్యర్థికి కాకుండా పొరపాటున వేరే వారికి ఓటు వేశానని ఆవేదనతో బ్యాలెట్ పేపర్‌ను చించివేశాడు. దీంతో అధికారులు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

చిమ్మపూడి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్దకు ఇరు వర్గాలు ఒక్కసారిగా దూసుకురావడంతో వాతావరణం వేడెక్కింది. చిమ్మపూడి సమస్యాత్మక ప్రాంతం కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జనం గుమిగూడకుండా చూస్తూ, ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి ఘటనా స్థలాన్ని సందర్శించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

 ఉమ్మడి వరంగల్‌లో సజావుగా పోలింగ్..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ అత్యంత సజావుగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే 14.9 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి సమస్యలు లేవని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అలాగే ప్లాస్టిక్ రహిత సామగ్రిని వాడుతూ జిల్లాలో రెండు ఎకో ఫ్రెండ్లీ ‘హరిత పోలింగ్ కేంద్రాల’ను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×